శ్రీకాంత్ అవుట్
ABN , First Publish Date - 2021-12-04T08:43:34+05:30 IST
సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో కిడాంబి కంగుతిన్నాడు.
గ్రూప్ చివరి మ్యాచ్లో సింధు ఓటమి
వరల్డ్ టూర్ ఫైనల్స్
బాలి (ఇండోనేసియా): సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో కిడాంబి కంగుతిన్నాడు. పురుషుల సింగిల్స్ గ్రూప్-బిలో భాగంగా జరిగిన మూడోదైన లీగ్ మ్యాచ్లో శ్రీకాంత్ 19-21, 14-21తో లీ జి జియా చేతిలో ఓడాడు. ఫలితంగా తన గ్రూపులో వరుసగా రెండు ఓటములతో శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గ్రూపు-ఎ నుంచి భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఇప్పటికే సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్లో చోటుకోసం ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సెన్తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
ఇక.. మహిళల సింగిల్స్ గ్రూపు-ఎ నుంచి వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న పీవీ సింధు.. మూడో లీగ్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది. శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్లో సింధు 12-21, 21-19, 14-21తో టాప్సీడ్ పోర్న్పవీ చోచువాంగ్ చేతిలో పరాజయంపాలైంది. సెమీస్లో అకానె యమగూచితో సింధు పోటీపడనుంది. కాగా.. మహిళల డబుల్స్లో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగిన భారత జోడీ అశ్విని-సిక్కిరెడ్డి నామమాత్రమైన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో గెలిచింది. సిక్కి జోడీ 21-19, 9-21, 21-14తో ఇంగ్లండ్ జంట చోల్-లారెన్పై నెగ్గింది.