శ్రీకాంత్‌ అవుట్‌

ABN , First Publish Date - 2021-12-04T08:43:34+05:30 IST

సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం ముగిసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో కిడాంబి కంగుతిన్నాడు.

శ్రీకాంత్‌ అవుట్‌

గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో సింధు ఓటమి

వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌


బాలి (ఇండోనేసియా): సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం ముగిసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో కిడాంబి కంగుతిన్నాడు. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో భాగంగా జరిగిన మూడోదైన లీగ్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 19-21, 14-21తో లీ జి జియా చేతిలో ఓడాడు. ఫలితంగా తన గ్రూపులో వరుసగా రెండు ఓటములతో శ్రీకాంత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గ్రూపు-ఎ నుంచి భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఇప్పటికే సెమీస్‌ చేరిన సంగతి తెలిసిందే. ఫైనల్లో చోటుకోసం ఒలింపిక్‌ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌తో లక్ష్యసేన్‌ తలపడనున్నాడు.


ఇక.. మహిళల సింగిల్స్‌ గ్రూపు-ఎ నుంచి వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న పీవీ సింధు.. మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో సింధు 12-21, 21-19, 14-21తో టాప్‌సీడ్‌ పోర్న్‌పవీ చోచువాంగ్‌ చేతిలో పరాజయంపాలైంది. సెమీస్‌లో అకానె యమగూచితో సింధు పోటీపడనుంది. కాగా.. మహిళల డబుల్స్‌లో ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి వైదొలగిన భారత జోడీ అశ్విని-సిక్కిరెడ్డి నామమాత్రమైన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచింది. సిక్కి జోడీ 21-19, 9-21, 21-14తో ఇంగ్లండ్‌ జంట చోల్‌-లారెన్‌పై నెగ్గింది.

Updated Date - 2021-12-04T08:43:34+05:30 IST