కేబీఆర్ పార్కులో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-03-20T22:39:15+05:30 IST

పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ అన్నారు.

కేబీఆర్ పార్కులో ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు మన జీవన విధానంలో భాగంగా కొనసాగాయని, అవి అంతరించి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ అన్నారు. కేబీఆర్ పార్క్ లో ఆదివారం జరిగిన ప్రపంచ పిచ్చుకల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిన్నతనంలో పిచ్చుకలతో ఆడుకున్న రోజులు అందరికీ గుర్తేనని, ఆ మధుర స్మృతులు రానున్న తరాలకు అందించాలంటే పర్యావరణ రక్షణ అందరి కర్తవ్యం కావాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రోత్సాహంతో తెలంగాణకు హరితహారం ద్వారా అడవుల పునరుజ్జీవనం, అర్బన్ పార్కుల అభివృద్ది పెద్ద ఎత్తున చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం, అటవీ శాఖ చర్యలతో తెలంగాణలో అడవులు, పర్యావరణం బాగా మెరుగుపడిందని, జంతువులు, పక్షి జాతుల సంచారం కూడా గతంతో పోల్చితే స్పష్టంగా పెరిగిందని కార్యక్రమంలో పాల్గొన్న పక్షి ప్రేమికులు అన్నారు. 


ఉదయమే కేబీయార్ పార్కుకు వచ్చి తమ కెమెరాల్లో పలు రకాల పక్షులను వారు బంధించారు. పిచ్చుకల దినోత్సవంలో భాగంగా కేబీఆర్ పార్కులో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం బర్డ్ వాచింగ్ తో పాటు, పర్యావరణ అవగాహన, అటవీ ప్రాంతాల్లో చేయదగిన, చేయకూడని పనులు, పిట్టుగూళ్ల పంపిణీ, స్కూలు పిల్లలకు డ్రాయింగ్, స్లోగన్స్ తయారీ, సిగ్నేచర్ కాంపెయిన్ లను నిర్వహించి బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జే.అక్బర్, బర్డింగ్ పాల్స్, డెక్కన్ బర్డర్స్, నేచర్ లవర్స్ సొసైటీల ప్రతినిధులు, వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు, హైదరాబాద్ జిల్లా అటవీ అధికారి ఎం.జోజి, కేబీయార్ పార్కు సిబ్బంది, వాకర్స్ అసోసియేష్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-20T22:39:15+05:30 IST