పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-25T05:05:56+05:30 IST

మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్‌
సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారులు

వనపర్తి అర్బన్‌, సెప్టెంబరు 24: మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని  కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో  మన ఊరు-మన బడి కార్యక్రమ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  జిల్లాలో 183 పాఠశాలలను గుర్తించామని ఆమె తెలిపారు. దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఉన్నందున, పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులలో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని, పెయింటింగ్‌లు వేయించి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. చేపట్టిన పనుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని ఆమె తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి రంగులు వేయడం పూర్తి చేసి సిద్ధం చేయాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, సీపీవో వెంకటరమణ, పంచాయతీ రాజ్‌ ఈఈ మల్లయ్య, డీఈవో రవీందర్‌, డీఆర్డఈవో నరసింహులు, ఎస్సీ అభివృద్ధి అధికారి మల్లికార్జున్‌, ఏఈ, డీఈలు , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T05:05:56+05:30 IST