కొడుకుని ఆయాకు అప్పగించి డ్యూటీకి వెళ్లింది.. తిరిగి వచ్చేసరికి బాలుడి చేతికి గాయం.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే..

ABN , First Publish Date - 2022-03-17T20:37:48+05:30 IST

ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

కొడుకుని ఆయాకు అప్పగించి డ్యూటీకి వెళ్లింది.. తిరిగి వచ్చేసరికి బాలుడి చేతికి గాయం.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే..

ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తల్లి ఉద్యోగం కారణంగా పిల్లల ఆలనా పాలన చూడడం పెద్ద సమస్యగా మారింది. పూర్వ కాలంలో లాగ ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో పిల్లల సంరక్షణ కోసం ఆయాల మీద, కేర్ టేకర్‌ల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా వారు పిల్లలను ఆప్యాయంగా, ప్రేమగా చూసుకోలేరు. ముంబైకి చెందిన ఓ మహిళ అలాగే తను ఉద్యోగానికి వెళ్తూ కొడుకుని ఆయాకు అప్పగించింది. 


ఒకరోజు ఆమె తిరిగి వచ్చే సరికి కొడుకు చేతికి గాయం కనిపించింది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళితే ఫ్రాక్చర్ అయిందని చెప్పి కట్టు వేశారు. ఆమె తిరిగి ఇంటికి వెళ్లి రహస్యంగా అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించింది. పిల్లాడి పట్ల ఆయా ఎంత నిర్దయగా వ్యవహరిస్తోందో చూసి షాకైంది. చెప్పిన మాట వినకపోయినా, భోజనం చేసేటపుడు మారాం చేసినా ఆ బాలుడిపై ఆయా చేయి చేసుకోవడం కెమేరాలో రికార్డ్ అయింది. 


ఆ రోజు ఉదయం ఆ బాలుడు షర్ట్ వేసుకునే సమయంలో మారాం చేశాడు. ఆ బాలుడిని దవడ మీద కొట్టిన ఆయా షర్ట్ వేసేందుకు బలవంతంగా చేయి వంచింది. దీంతో చేతి ఎముక ఫ్రాక్చర్ అయింది. ఈ సంఘటన అంతా చూసిన ఆ మహిళకు స్పృహ తప్పింది. ఈ ఘటనను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. విచారణలో ఆ వృద్ధురాలు మానసిక రోగి అని తేలింది. 

Updated Date - 2022-03-17T20:37:48+05:30 IST