బిల్లులు రాక హైదరాబాద్లో పనికి
ABN , First Publish Date - 2022-07-18T08:44:51+05:30 IST
బిల్లులు రాక హైదరాబాద్లో పనికి
అప్పులు చేసి గ్రామాభివృద్ధి చేశా
ఆ పనులకు బిల్లులు ఇవ్వకుంటే ఎలా?
మా ఖాతాల్లోని సొమ్మూ లాగేశారాయే!
ఓ వైసీపీ మహిళా సర్పంచ్ వేదన
నంద్యాల, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఈమె పేరు పిట్టల శేషమ్మ. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట వైసీపీ సర్పంచ్. అప్పులు చేసి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు. బీసీ, ఎస్సీ కాలనీలో తాగునీటి పనుల కోసం రూ.3 లక్షలు ఖర్చు పెట్టారు. జగనన్న కాలనీల్లో రూ.3 లక్షలతో రెండు బోర్లు, రైతుపల్లెలో రూ.1.32 లక్షలతో బోరు, గ్రామంలో వీధి దీపాలు, పైపు లీకేజీ పనుల కోసం మొత్తం 8 నుంచి 10 లక్షల రూపాయల వరకూ ఖర్చు చేశారు. వాటికి సంబంధించిన బిల్లులు రాలేదు. సర్పంచ్ల ఖాతాల్లోని 14, 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసుకుందామంటే వాటిని కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది. అధికారులను అడిగితే తమ చేతిలో ఏమీలేదని, జగనన్న ఎప్పుడు వేస్తే అప్పుడు తీసుకోండని చెబుతున్నారు. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక హైదరాబాద్ బాట పట్టారు. సర్పంచ్ కూతురు హైదరాబాద్లో ఉండడంతో వారంలో మూడు నాలుగు రోజులు అక్కడకు వెళ్లి అక్కడ చేపలు అమ్ముకొని తిరిగి గ్రామానికి వస్తారు. దీంతో నెలకు రూ.20 వేల వరకు ఆదాయం వస్తోందని ఆమె చెప్పారు. ఈమె భర్త నాగశేషులు గ్రామంలోనే ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. సర్పంచ్గా గెలిచి గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేశామని, తీరా పనులు చేశాక బిల్లులు రాకపోవడంతో తమ పరిస్థితి దిగజారిందని, ఇప్పటికైనా సీఎం జగన్మోహన్రెడ్డి వెంటనే బిల్లులు విడుదల చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.