వర్క్ ఫ్రమ్ ఎనీవేర్... ఉద్యోగులందరికీ అమలు...
ABN , First Publish Date - 2022-02-08T20:52:33+05:30 IST
ఈ-కామర్స్ దిగ్గజం ‘మీషో’... తన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ సంస్థలో... సాఫ్టుబ్యాంక్, ఫేస్బుక్ పెట్టుబడులున్న విషయం తెలిసిందే.
శాటిల్లైట్ కార్యాలయాల ఏర్పాటు కూడా...
ఆరేళ్ళలోపు వయస్సున్న పిల్లలుంటే... డే కేర్ సదుపాయాలు...
ఇక శాశ్వత విధానం...
ఉద్యోగులకు ‘ఈ-కామర్స్ మీషో’ బంపర్ ఆఫర్...
హైదరాబాద్ : ఈ-కామర్స్ దిగ్గజం ‘మీషో’... తన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ సంస్థలో... సాఫ్టుబ్యాంక్, ఫేస్బుక్ పెట్టుబడులున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఇప్పటికే ఐటీ రంగం మొదలుకుని పలు సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇచ్చాయి. ఒమిక్రాన్కు ముందు... అంటే జనవరి నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రారంభించాలని పలు సంస్థలు భావించాయి. కానీ అంతలోనే ఒమిక్రాన్ ప్రభావం మొదలుకావడంతో... ఐటీ సహా ఆయా రంగాల్లోని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగించాయి.
తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘మీషో’... తన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇంటి నుండి, లేదా ఆఫీస్నుండి, లేదంటే తమకు ఇష్టం వచ్చిన చోటు నుండి విధులు నిర్వర్తించేందుకు... ఉద్యోగులకు అవకాశం కల్పించింది. ఇది కొద్ది రోజుల కోసం ప్రకటించిన విధానం కాదని, ఉద్యోగులు శాశ్వతంగా తమ ఎంపిక మేరకు పని చేయవచ్చునని పేర్కొంది. ఈ సంస్ధకు... బెంగళూరులో కేంద్ర కార్యాలయముంది. ఉద్యోగుల డిమాండ్ ఆధారంగా, అధిక టాలెంట్ డెన్సిటీ ఉన్న ప్రదేశాల్లో శాటిలైట్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనుంది. అంటే దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల్లో కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనుంది. కాగా... భవిష్యత్తు పని విధానాలకు సంబంధించి పలు నమూనాలు అధ్యయనం చేశామని, మీషోతో అంతర్జాతీయంగా ఉన్న ప్రతిభావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయని మీషో సీహెచ్ఆర్ఓ ఆశిష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
మీషోలో ప్రస్తుతం 1700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందరికీ కొత్త విధానాన్ని అమలు చేస్తామని, కేంద్ర కార్యాలయానికి అధికారిక ప్రయాణాల కోసం వచ్చే వర్కింగ్ పేరెంట్స్కు మద్దతుగా... వారి ఆరేళ్లలోపు వయస్సున్న చిన్నారుల కోసం మీషో డే-కేర్ సదుపాయాలు కూడా కల్పిస్తోంది.