ఆస్తి వివాదం.. దంపతులపై దాడి.. గృహిణి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-04-10T13:18:10+05:30 IST
ఆస్తి వివాదంతో కుటుంబ సభ్యులే దంపతులపై దాడి చేశారు. మనస్తాపం చెందిన గృహిణి ఆత్మహత్యకు యత్నించింది.
హైదరాబాద్/బంజారాహిల్స్ : ఆస్తి వివాదంతో కుటుంబ సభ్యులే దంపతులపై దాడి చేశారు. మనస్తాపం చెందిన గృహిణి ఆత్మహత్యకు యత్నించింది. సంగారెడ్డికి చెందిన గాగిరి విష్ణుప్రపూర్ణ విద్యుత్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతడి సోదరి లావణ్యను బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 7లో నివసించే గౌరీప్రసాద్కు ఇచ్చి 2003లో వివాహం చేశారు. గౌరీప్రసాద్కు ఆస్తి విషయంలో సోదరుడు శ్రీనివాస్, ఇద్దరు సోదరిలు శ్రీలక్ష్మి, సరితతో వివాదం ఉంది. రెండు రోజుల క్రితం విష్ణుప్రపూర్ణ తన సోదరి లావణ్య ఇంటికి వెళ్లాడు.
ఇద్దరూ మాట్లాడుకుంటుండగా శ్రీనివాస్, శ్రీలక్ష్మి, సరిత, ఆమె కుమారుడు ఉదయ్ వెళ్లి లావణ్యపై దాడి చేశారు. విషయం తెలుసుకుని కార్యాలయం నుంచి గౌరీప్రసాద్ ఇంటికి రాగా అతడిపై కూడా దాడి చేశారు. విష్ణుప్రపూర్ణ అందరికీ సర్దిచెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. తనపై దాడిచేయడంతో మనస్తాపం చెందిన లావణ్య బాత్రూమ్లోకి వెళ్లి శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న విష్ణుప్రపూర్ణ కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ వచ్చారు. శ్రీనివాస్తోపాటు మిగతా వారిని వారు నిలదీయగా బెదిరించారు. విష్ణుప్రపూర్ణ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.