మహిళల హక్కులను కాపాడుకోవాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-12-05T07:24:08+05:30 IST
మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా హక్కులను కాపాడుకోవాలని కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ మహిళా కమిషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, న్యాయసేవలపై శనివారం భువనగిరిలో అవగాహన సదస్సు నిర్వహించారు.
భువనగిరి రూరల్, డిసెంబరు 4: మహిళలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా హక్కులను కాపాడుకోవాలని కలెక్టర్ పమేలాసత్పథి అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ మహిళా కమిషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, న్యాయసేవలపై శనివారం భువనగిరిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ మహిళలు వారి వారి రంగాల్లో ఏ స్థాయిలో కూడా తమ హక్కులను కోల్పోవద్దని, పరిస్థితులు అధిగమించేలా ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఆడపిల్లలు, మహిళలపై జరిగే దురాచారాలు, గృహ హింస, లైంగిక వేధింపులు, అకృత్యాలపట్ల చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అదనపు న్యాయమూర్తి ఎం.భవాని మాట్లాడుతూ రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని, అవే ప్రాథమిక హక్కులన్నారు. ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికారి కార్యదర్శి జి.వేణు మాట్లాడుతూ ప్రతీ మహిళకు న్యాయ సేవ అందించేందుకు న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎస్.రజిని, డీసీవో పరిమళ, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, డీఎంవో సబిత, డీఏవో కె.అనురాధ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి, సీనియర్ న్యాయవాది కేవీ. వెంకటరమణారావు, భువనగిరి జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోద వెంకటేశ్వర్లు, రాజిరెడ్డి, ఈఎస్ కృష్ణప్రియ, ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి, ఉద్యానవన జిల్లా అధికారి అన్నపూర్ణ, డీపీవో సునంద, కలెక్టర్ సూపరింటెండెంట్ వీరాబాయి తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ
మండలంలోని అనంతారం శివారులోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ పమేలాసత్పథి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. విద్యార్థినులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా, బెడ్షీట్స్, నోట్ పుస్తకాలు, దుస్తులు కాస్మెటిక్స్ సక్రమంగా ఇస్తున్నారా అని ఆరా తీశారు. ఆమె వెంట జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్, ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ జాన్సన్ ఉన్నారు.