ఈక్విటీకే మహిళ నీరాజనం

ABN , First Publish Date - 2021-03-08T06:41:30+05:30 IST

దేశంలో 18-25 సంవత్సరాల మధ్య వయస్కులైన యువతులు సాంప్రదాయిక పెట్టుబడి సాధనాలపై పెదవి విరుస్తున్నారు. ఎక్కువ రిస్క్‌ ఉన్నా అధిక రాబడి ఇచ్చే పెట్టుబడులకే తమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు...

ఈక్విటీకే మహిళ నీరాజనం

  • బంగారం పైనా తగ్గని మోజు
  • క్రిప్టోల్లోనూ పెట్టుబడులు



న్యూఢిల్లీ : దేశంలో 18-25 సంవత్సరాల మధ్య వయస్కులైన యువతులు సాంప్రదాయిక పెట్టుబడి సాధనాలపై పెదవి విరుస్తున్నారు. ఎక్కువ రిస్క్‌ ఉన్నా అధిక రాబడి  ఇచ్చే పెట్టుబడులకే తమ ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. మహిళల పెట్టుబడి ధోరణులపై గ్రో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. అధిక శాతం మంది సాంప్రదాయికమైన ఎఫ్‌డిల కన్నా రిస్క్‌ అధికంగా ఉన్న ఈక్విటీ పెట్టుబడులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ సర్వే తేల్చింది. అలాగే అన్ని ఆదాయ శ్రేణుల్లోని మహిళల్లోనూ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల పట్ల మక్కువ కనిపించింది. దేశవ్యాప్తంగా మొత్తం 28 వేల మంది విభిన్న వయోశ్రేణుల్లోని మహిళల పెట్టుబడి ధోరణులపై ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ఆదాయం, వయస్సు ఆధారంగా పెట్టుబడి లక్ష్యాలు మారుతున్నట్టు తేలింది.


  1. అన్ని వయోశ్రేణులు, ఆదాయ వర్గాల్లోని మహిళలు బంగారానికి తమ పోర్ట్‌ఫోలియోలో స్థిరమైన స్థానాన్ని కొనసాగించారు. 25 శాతం మంది మహిళలు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. రూ.10 లక్షల పైబడి ఆదాయం ఆర్జించే మహిళల్లో 40 శాతం మంది బంగారంపై మొగ్గు చూపారు. 
  2. రూ.30 లక్షల ఆదాయ శ్రేణిలోని వారిలో 6 శాతం మంది క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టారు. రూ.10 లక్షల కన్నా తక్కువ ఆదాయ శ్రేణిలోని వారిలో క్రిప్టోల్లో పెట్టుబడి పెట్టిన వారి సంఖ్య 4 శాతం ఉంది.
  3. రూ.30 లక్షలు, ఆ పైబడిన ఆదాయ శ్రేణిలోని వారిలో అధిక శాతం మంది రియల్‌ ఎస్టేట్‌పై మక్కువ ప్రదర్శించారు. 
  4. పెట్టుబడి లక్ష్యాల విషయానికొస్తే 57 శాతం మంది మిలీనియల్స్‌ వ్యక్తిగత అవసరాలకు, 28 శాతం మంది ప్రయాణాల కోసం, మరో 28 శాతం ఉన్నత విద్యకు ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.
  5. రూ.30 లక్షలు, పైబడిన వార్షికాదాయ శ్రేణిలోని మహిళలు రిటైర్మెంట్‌ అనంతర అవసరాలకు ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. వీరిలో 70 శాతం మంది వీలైనంత త్వరగా రిటైర్‌ కావాలనుకుంటున్నారు. 
  6. రూ.10-30 లక్షల ఆదాయ శ్రేణిలోని వారిలో 36 శాతం మంది, రూ.5-10 లక్షల ఆదాయ శ్రేణిలోని వారిలో 26 శాతం మంది ముందుగానే రిటైర్‌ కావాలనుకుంటున్నారు. 
  7. 35 సంవత్సరాల వయోశ్రేణిలోని వారిలో 64 శాతం మంది పిల్లల విద్య, వివాహ అవసరాలకు పెట్టుబడులు పెడుతున్నారు. 



ఇన్వెస్ట్‌ చేయని వారూ ఉన్నారు


ఏ పెట్టుబడులకు మొగ్గు చూపని  2000 మంది అభిప్రాయాలు కూడా ఈ సర్వేలో తీసుకున్నారు. వారిలో 49 శాతం మంది సరైన పెట్టుబడి పరిజ్ఞానం లేకపోవడమే కారణమని చెప్పగా 32 శాతం మంది పొదుపు చేయడానికి అవసరమైన వనరులు లేవన్నారు. మార్కెట్లో డబ్బు పోగొట్టుకుంటామేమో అన్న భయం 13ు మంది వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-03-08T06:41:30+05:30 IST