హత్యా..? ప్రమాదమా..!

ABN , First Publish Date - 2022-01-18T06:26:21+05:30 IST

ఓ వివాహిత సోమవారం తెల్లవారుజామున రోడ్డుపై విగతజీవిగా పడి ఉండటం తో స్థానిక శిఖామణి సెంటర్‌ వాసులు ఉలిక్కిపడ్డారు.

హత్యా..? ప్రమాదమా..!

రోడ్డుపై విగతజీవిగా మహిళ మృతదేహం

మిస్టరీగా మారిన అనుమానాస్పద కేసు

గుణదల, జనవరి 17 : ఓ వివాహిత సోమవారం తెల్లవారుజామున రోడ్డుపై విగతజీవిగా పడి ఉండటం తో స్థానిక శిఖామణి సెంటర్‌ వాసులు ఉలిక్కిపడ్డారు. మహిళ ఎవరు? ఎవరైనా హత్యచేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. స్థానికులెవరూ మహిళను గు ర్తించలేదు. మాచవరం సీఐ ఘటనా స్థలానికి చేరుకుని పూర్వాపరాలు సేకరించారు. అర్ధరాత్రో లేక తెల్లవారుజామునో మహిళ ఒంటరిగా రోడ్డుపైకి ఎందుకు వచ్చింది? ఏదైనా వాహనం ఢీకొన్న శబ్దమైనా రావాలి కదా అన్నది స్థానికులకు, పోలీసులకు వస్తున్న అనుమానం. నగరానికి సంబంధం లేకుం డా ఒంటరిగా జీవిస్తున్న వారెవరూ లేరని స్థానికులు తెలిపారు. మహిళ మృతిచెంది 12గంటలు గడుస్తున్నా సంబంధీకులెవరూ రాకపోవడం పెద్ద మిస్టరీగా మారింది. ఒకవేళ నగరానికి సంబంధం లేని వ్యక్తులు వేరే ప్రదేశంలో హత్యచేసి అనుమానం రాకుండా ఉండేలా ఇక్కడకు తీసుకొచ్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నట్లు మాచవరం పోలీసులు తెలిపారు. మహిళ ఆచూకీ తెలిస్తే 94406 27053 నెంబరుకు ఫోన్‌ చేసి తెలియజేయాలని సీఐ తెలిపారు.

Updated Date - 2022-01-18T06:26:21+05:30 IST