హాస్పిటల్‌లో మరిదిని చితక్కొట్టిన వదిన.. ఆ దాడి వెనుక కారణం ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-14T18:51:43+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా దామోహ్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం కలకలం రేగింది.

హాస్పిటల్‌లో మరిదిని చితక్కొట్టిన వదిన.. ఆ దాడి వెనుక కారణం ఏంటో తెలిస్తే..

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా దామోహ్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం కలకలం రేగింది. ఓ పురుషుడిపై మహిళ భౌతిక దాడికి పాల్పడింది. విచారిస్తే ఆ మహిళ అతడికి వదిన అవుతుందని తేలింది. ఆ మహిళ సోదరిని రెండేళ్ల కిందట ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడని, కట్నం వేధింపులు భరించలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని, ఆ ఆక్రోశంతోనే ఆ మహిళ అతడిపై దాడికి పాల్పడిందని తేలింది. 


దామోహ్‌కు చెందిన హేమావతి అనే యువతి రెండేళ్ల క్రితం లాక్‌డౌన్ సమయంలో గోవింద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. హేమావతి తండ్రి దాదాపు ఆరు లక్షల రూపాయలు కట్నంగా అందించారు. అయినా ఆ డబ్బులు సరిపోవని, ఇంకా కావాలని గోవింద్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. అలాగే గతేడాది హేమావతికి గర్భ స్రావం అయింది. దీంతో ఆమెపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. 


అత్తింటి వారి వేధింపులు భరించలేక హేమావతి శుక్రవారం రాత్రి విషం తాగేసింది. ఆమెను భర్త వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించాడు. రెండ్రోజుల చికిత్స అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఆమె మరణించింది. విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న హేమవతి సోదరి ప్రియాంక ఉగ్రరూపం దాల్చింది. తన సోదరిని రెండేళ్లు వేధించిన గోవింద్‌పై దాడికి దిగింది. అందరి ఎదురుగానే అతడిని చితక్కొట్టింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-02-14T18:51:43+05:30 IST