Teacher Burnt Alive: తిట్టి.. అంతా చూస్తుండగానే కొట్టి ఓ మహిళా టీచర్ సజీవ దహనం.. ఇంత దారుణానికి అసలు కారణమేంటంటే..
ABN , First Publish Date - 2022-08-17T20:31:27+05:30 IST
రాజస్థాన్ (Rajasthan)లో ఓ మహిళా ఉపాధ్యాయురాలిని కొందరు దుండగులు సజీవ దహనం చేశారు.
రాజస్థాన్ (Rajasthan)లో ఓ మహిళా ఉపాధ్యాయురాలిని కొందరు దుండగులు సజీవ దహనం చేశారు. దాదాపు 7 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భయంకర ఘటన రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో కాదు.. రాష్ట్ర రాజధాని జైపూర్కు దగ్గర్లో జరిగింది. ఇంతకీ ఆ మహిళ చేసిన తప్పు ఏంటంటే, ఆమె చాలా కాలం క్రితం ఓ వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగింది. దాంతో ఆ వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.
ఇది కూడా చదవండి..
Half Body Girl: 15 ఏళ్ల క్రితం నడుము వరకే దేహంతో పుట్టిన ఓ బాలిక.. ఇప్పుడు వార్తల్లో నిలవడం వెనుక..
తీవ్రగాయాలపాలైన ఉపాధ్యాయురాలు మంగళవారం అర్థరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జైపూర్కు 80 కిలోమీటర్ల దూరంలోని రైసర్ గ్రామంలో ఆగస్టు 10న జరిగింది. గత బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో అనితా రేగర్ (32) అనే స్కూల్ టీచర్ తన కుమారుడితో కలిసి పాఠశాలకు వెళుతోంది. ఆ సమయంలో కొందరు దుండగులు అనితను చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె పరుగులు పెట్టింది. వెంబడించిన నిందితులు అనితపై పెట్రోల్ పోసి (Teacher Burnt Alive) నిప్పంటించారు. మంటలు చెలరేగడంతో అనిత భయంకరంగా కేకలు పెట్టింది.
చుట్టు పక్కల జనాలు ఆ ఘటనను వీడియోలు తీయడానికి ప్రయత్నించారు తప్ప ఎవరూ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించలేదు. సమాచారం అందుకున్న అనిత భర్త తారాచంద్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భార్యను ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్లో ఆమె సుమారు ఏడు రోజుల పాటు చికిత్స అందుకున్న అనిత చివరకు మంగళవారం రాత్రి మరణించింది. తారాచంద్ నిందితుల గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో తారాచంద్ డీజీపీని ఆశ్రయించారు. డీజీపీ ఆదేశాలతో స్థానిక పోలీసుల్లో చలనం వచ్చింది. నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించారు. కాగా, నిందితుడికి అనిత కొన్నేళ్ల క్రితం రెండున్నర లక్షలు ఇచ్చినట్టు సమాచారం. ఆ డబ్బులు తిరిగి అడగడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.