ఏడాది క్రితం ప్రేమ పెళ్లి.. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
ABN , First Publish Date - 2020-09-04T19:15:15+05:30 IST
తోటపాలెం పంచాయతీ పెయ్యలవానిపేట గ్రామానికి చెందిన బగాది శిరీష (22) అనే యువతి బుధవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. శిరీష కన్నఊరు ఎల్ఎన్పేట మండలం చింతలబడవంజ గ్రామం. శిరీష, పెయ్యలవాని పేటకు
ఏడాదిన్నర కిందటే ప్రేమ వివాహం
ఎచ్చెర్ల (శ్రీకాకుళం): తోటపాలెం పంచాయతీ పెయ్యలవానిపేట గ్రామానికి చెందిన బగాది శిరీష (22) అనే యువతి బుధవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. శిరీష కన్నఊరు ఎల్ఎన్పేట మండలం చింతలబడవంజ గ్రామం. శిరీష, పెయ్యలవాని పేటకు చెందిన బోనెల హేమసుందర్ సుమారు ఏడాదిన్నర కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ శ్రీకాకుళం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న క్రమంలో ప్రేమలో పడ్డారు. లావేరు మండలం మురపాకలోని ఓ ఆలయంలో వివాహం చేసుకొని, పొందూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఇరువురూ పెయ్యలవాని పేటలో నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం శిరీష తన ఇంటిలో అపస్మారక స్థితిలో పడిఉండడంతో హేమసుందర్ ఆటోలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. కాగా, తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని శిరీష తల్లి రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శిరీష మృతి చెందిన విషయం ఆమె ఆడపడచు ద్వారా తనకు తెలిసిందన్నారు. వరకట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు శిరీష తనకు ఫోన్ చేసి చెప్పేదని రాజేశ్వరి ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఎచ్చెర్ల ఎస్ఐ జి.రాజేష్ గురువారం శవపంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.