ఎమ్మెల్యే సీతక్క ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-02T21:33:15+05:30 IST

భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదనే మనస్తాపంతో ఓ మహిళ ఎమ్మెల్యే సీతక్క ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన

ఎమ్మెల్యే సీతక్క ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

ఏటూరునాగారం రూరల్‌ (వరంగల్): భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదనే మనస్తాపంతో ఓ మహిళ ఎమ్మెల్యే సీతక్క ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని శివాపురం గ్రామానికి చెందిన జ్యోత్స్నకు మండల కేంద్రానికి చెందిన వావిలాల ముఖే్‌షతో నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత వరకట్నం కోసం అత్తామామలు వేధించడం మొదలెట్టారు. ఈ క్రమంలో జ్యోత్స్నను భర్త పుట్టింటికి పంపించాడు. కాపురానికి తీసుకెళ్లకుండా మానసికంగా వేధించాడు. 


ఈ విషయాన్ని పలుమార్లు పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మనస్తాపం చెందిన జ్యోత్స్న ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. మండలంలోని చిన్నబోయినపల్లి వద్ద పోడుభూముల విషయంపై గ్రామస్థులతో ఎమ్మెల్యే సీతక్క సమావేశమై చర్చిస్తున్న సమయంలో పురుగుల డబ్బాతో అక్కడికి వెళ్లిన జ్యోత్స్న ఆత్మాహత్యాయత్నం చేసింది. పురుగుల మందు తాగేందుకు యత్నిస్తుండగా ఎమ్మెల్యే అడ్డుకున్నారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. జ్యోత్స్నను వెంటనే  స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2020-07-02T21:33:15+05:30 IST