బైక్పై నుంచి జారిపడి మహిళ దుర్మరణం
ABN , First Publish Date - 2021-01-19T05:35:45+05:30 IST
సంక్రాంతికి సొంతింటికి వెళ్లి తిరిగి భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా సీటుపై నుంచి జారిపడి మహిళ దుర్మరణం చెందింది.
హరిపురం, జనవరి 18 : సంక్రాంతికి సొంతింటికి వెళ్లి తిరిగి భర్తతో కలసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా సీటుపై నుంచి జారిపడి మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటన మందస మండలం కొత్తపలి- బిన్నల మధ్య జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సోంపేట మండలం బారువ గ్రామానికి చెందిన దున్న కృష్ణారావు, పద్మావతి(45)లు దంపతులు. రైల్వే ఉద్యోగి అయిన కృష్ణారావు పలాసలో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబమంతా కాశీబుగ్గలో నివాసముంటుంది. సంక్రాంతికి సొంత గ్రామమైన బారువ వెళ్లి తిరిగి వస్తుండగా బిన్నల సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ వెనుక కూర్చున్న భార్య పద్మావతి సీటుపై నుంచి జారిపడి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో బైక్ కూడా బోల్తాపడడంతో కృష్ణారావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను 108లో పలాస ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మందస ఎస్ఐ రామరావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.