అత్తను చంపిన అల్లుడు

ABN , First Publish Date - 2022-05-19T06:46:28+05:30 IST

భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్తను కత్తితో నరికి చంపేశాడు ఓ అల్లుడు. అడ్డొచ్చిన మామగారు, బావమరిదిపై కూడా దాడి చేశాడు.

అత్తను చంపిన అల్లుడు

రక్తపు మడుగులో అత్త మృతదేహం
పిఠాపురం, మే 18: భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్తను కత్తితో నరికి చంపేశాడు ఓ అల్లుడు. అడ్డొచ్చిన మామగారు, బావమరిదిపై కూడా దాడి చేశాడు.  కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. పిఠాపురం మండలం కొత్త కందరాడకు చెందిన సైతన రమేష్‌, పిఠాపురం పట్టణానికి చెందిన దుర్గా దివ్య తేజశ్రీకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి హనుమాన్‌ శోక్స (4) అనే బాబు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. అనుమానిస్తూ వేధిస్తుండటంతో దుర్గ పిఠాపురంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. దీనిపై గతంలో పెద్దల్లో మాట్లాడినా వివా దం పరిష్కారం కాలేదు. ఈలోగా భార్య దుర్గ హైదరాబాదులో జాబ్‌ కోసం కోచింగ్‌ తీసుకునేందుకు వెళ్లింది. భార్య కాపురానికి రాకపోవడానికి అత్తే కారణమని కోపం పెంచుకున్న రమేష్‌ బుధవారం ఉదయం 6గంటల సమయంలో పిఠాపురం పట్టణంలోని సీతయ్యగారి తోటలోని అత్తవారి ఇంటి వద్ద మాటువేశాడు. ఇంటి బయట శుభ్రం చేసేందుకు వచ్చిన అత్త గండేపల్లి వెంకటరమణమ్మ(44)పై కత్తితో దాడిచేసి దారుణంగా నరికి చంపాడు. ఆమె కేకలకు బయటకు వచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది వెంకట దిలీప్‌కుమార్‌లపై కూడా విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కళ్లెదుటే జరిగిన సంఘటనతో సత్యనారాయణ, దిలీప్‌కుమార్‌లు షాక్‌కు గురయ్యారు.  హత్య అనంతరం నిందితుడు రమేష్‌ తన కుమారుడు హనుమాన్‌ను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయి కందరాడలో తల్లికి అప్పగించిన తర్వాత పిఠాపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.  రమేష్‌ కొంతకాలంగా భార్య, అత్తమామలపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎం.ఫార్మసీ చదువుకున్న అతను కొన్నాళ్లు అనకాపల్లిలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. కాకినాడ డీఎస్పీ భీమారావు, పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2022-05-19T06:46:28+05:30 IST