మహిళ హత్యకేసు నిందితుడి రిమాండ్
ABN , First Publish Date - 2021-06-23T04:56:42+05:30 IST
మహిళ హత్యకేసు నిందితుడి రిమాండ్
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ లక్ష్మీనారాయణ
యాలాల: ఓ మహిళను హత్య చేసిన నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన చెన్నారం పద్మమ్మ(41) భర్త చాలాకాలం క్రితం విడిపోయారు. పద్మమ్మ అప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటూ కొందరి ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అక్కడ జనరేటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న వన్నెల మురళి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మురళి భార్య కూడా వదిలేయడంతో వీరిరువురు గత 18ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గత ఏడాది కరోనా లాక్డౌన్ సమయంలో పద్మమ్మ, మురళి హాజీపూర్ గ్రామానికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. మురళి మధ్యమధ్యలో హైదరాబాద్ వెళ్లి డబ్బులు తేవడంతో, పద్మమ్మ ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేది. డబ్బులు ఖర్చు పెట్టొద్దని వారించినా పద్మమ్మ వినిపించుకోకపోవడంతో ఆమెను అంతమొందించాలని మురళి పథకంపన్నాడు. ఈక్రమంలోనే ఏప్రిల్ 27వ తేదీన పద్మమ్మకు ఎక్కువ మొత్తంలో మద్యం తాగించి, తాను కూడా తాగాడు. ఆమె గాఢ నిద్రలోకి వెళ్లగానే ఆమెను పిడిగుద్దులు గుద్ది, కరెంటు వైరుతో ఆమె మెడకు బిగించాడు. పద్మమ్మ మృతిచెందిందని భావించి ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. ఉదయం పద్మమ్మ స్పృహకోల్పోయిందని ఆమె అల్లుడు చెన్నారం శేఖర్కు సమాచారం అందించి తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పద్మమ్మ చికిత్స పొందుతూ ఏప్రిల్ 29వ తేదీన మృతి చెందింది. విషయం తెలుసుకున్న మురళి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన మురళి హైదరాబాద్లో ఓ హోటల్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈనెల 21వ తేదీన అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. అదేవిధంగా మురళి చోరీకి పాల్పడిన రూ.10వేల నుంచి రూ.20వేల నగదు, పద్మమ్మ మెడకు బిగించిన కరెంటు వైరు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మురళిని జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ జలందర్రెడ్డి, ఎస్ఐ ఉన్నారు.