భార్యను ఏడాదిపాటు టాయ్‌లెట్‌లో బంధించిన భర్త

ABN , First Publish Date - 2020-10-15T14:59:32+05:30 IST

భార్యను ఏడాదిపాటు మరుగుదొడ్డి( టాయ్‌లెట్‌)లో బంధించిన భర్త బాగోతం...

భార్యను ఏడాదిపాటు టాయ్‌లెట్‌లో బంధించిన భర్త

పానీపట్ (హర్యానా): భార్యను ఏడాదిపాటు మరుగుదొడ్డి( టాయ్‌లెట్‌)లో బంధించిన భర్త బాగోతం హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా రిష్పూర్ గ్రామంలో వెలుగుచూసింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 35 ఏళ్ల మహిళను సాక్షాత్తూ భర్తే ఏడాదిపాటు మరుగుదొడ్డిలో బంధించాడని తెలిసిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న మరుగుదొడ్డిలో బలహీనంగా ఉన్న మహిళను అధికారులు కాపాడి సివిల్ ఆసుపత్రికి తరలించారు. భార్యకు మానసిక ఆరోగ్యం ఉందని ఆమెను భర్త మరుగుదొడ్డిలో వేసి తాళం వేసి ఏడాదిపాటు బంధించాడు. దీనిపై మహిళా రక్షణ అధికారి రజనీగుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుగుదొడ్డిలో దయనీయమైన పరిస్థితుల్లో పడుకున్న మహిళను అధికారులు కాపాడారు. బాధిత మహిళ బలహీనంగా ఉందని, నడవలేకపోయిందని, ఆమెకు ఆహారం ఇచ్చామని గుప్తా చెప్పారు. 


తన భార్యకు మానసిక ఆరోగ్య సమస్య ఉందని భర్త నరేష్ కుమార్ చెబుతున్నా, బాధితురాలు కుటుంబసభ్యులందరినీ గుర్తించారని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని అధికారులు చెప్పారు. భార్యను బంధించిన భర్త నరేష్ కుమార్ పై ఐపీసీసెక్షన్ 498 ఏ, 342 కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారి సురేందర్ చెప్పారు. 


బందీఖానాలో బాధత మహిళకు సరైన ఆహారం, తాగునీరు కూడా ఇవ్వలేదని అధికారులు చెప్పారు. బాధిత మహిళకు 17 సంవత్సరాల క్రితం నరేష్ కుమార్ తో వివాహం అయిందని, వారికి 15,11,13 సంవత్సరాల వయసు గల పిల్లలున్నారని అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-10-15T14:59:32+05:30 IST