ప్రియుడితో కలిసి కుమార్తెను కర్కశంగా మట్టుబెట్టిన తల్లి

ABN , First Publish Date - 2021-05-17T21:49:43+05:30 IST

ప్రియుడితో కలిసి తన నాలుగేళ్ల కుమార్తెను కర్కశంగా చంపేసి అడవిలో పడేసిందో తల్లి. రాజస్థాన్‌లో జరిగిన

ప్రియుడితో కలిసి కుమార్తెను కర్కశంగా మట్టుబెట్టిన తల్లి

జైపూర్: ప్రియుడితో కలిసి తన నాలుగేళ్ల కుమార్తెను కర్కశంగా చంపేసి అడవిలో పడేసిందో తల్లి. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. తన భార్య టీనా (25), నాలుగేళ్ల కుమార్తె నందిని కనిపించడం లేదంటూ గతేడాది డిసెంబరు 16న కోటా జిల్లాలోని బోర్ఖెరా గ్రామానికి చెందిన సుమిత్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని టీనా కోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు టీనా ఆచూకీ లభ్యమైంది. జైపూర్ జిల్లాలోని ఉడావాలా గ్రామంలో ఆమె ఉన్నట్టు ఈ నెల 13న పోలీసులు గుర్తించారు. అక్కడికెళ్లి చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అక్కడామె తన ప్రియుడు ప్రహ్లాద్ సహాయ్ (45)తో కలిసి జీవిస్తోంది.


టీనాను అదుపులోకి తీసుకున్న పోలీసులు నందిని గురించి ప్రశ్నించారు. కుమార్తె తన తల్లిదండ్రుల వద్ద ఉందని చెప్పి పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. పోలీసులు నిలదీయడంతో ఆ తర్వాత నిజం ఒప్పుకుంది. తన ప్రియుడు ప్రహ్లాద్‌తో కలిపి నందినిని చంపేసి అల్వార్‌లోని సరిస్కా అడవిలో  పడేసినట్టు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. టీనా గతేడాది నవంబరు 11నే గ్రామం నుంచి వెళ్లిపోయింది. 


అప్పటి నుంచి ప్రియుడితోనే ఉంటోంది. ఆ తర్వాత నెల రోజులకు ప్రహ్లాద్‌తో ఆడుతూ నందిని గాయపడింది. దీంతో చిన్నారిని తీసుకెళ్లి షాపూరాలోని ఓ వైద్యుడికి చూపించారు. ఆయన జైపూర్ సిఫారసు చేశాడు. అయితే, చిన్నారికి చికిత్సకు ఖర్చు పెట్టేందుకు ప్రహ్లాద్ ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ కలిసి నందిని శాలువాతో గొంతు బిగించి చంపేశారు. అనంతరం అడవిలో పడేసి వెళ్లిపోయారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2021-05-17T21:49:43+05:30 IST