శ్రీనగర్లో ఎన్కౌంటర్...ముగ్గురు హతం
ABN , First Publish Date - 2020-09-17T12:30:51+05:30 IST
జమ్మూకశ్మీరులోని శ్రీనగర్లోని బాటమాలో ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఓ స్థానిక మహిళతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని శ్రీనగర్లోని బాటమాలో ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఓ స్థానిక మహిళతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ లోని ఫిర్దౌజాబాద్ బాటమాలో ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు శ్రీనగర్ పోలీసులు సీఆర్ పీఎఫ్ జవాన్లతో కలిసి గాలింపు ప్రారంభించారు. జవాన్లు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్ లో కౌసర్ అనే స్థానిక మహిళ హతమైంది. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. సీఆర్ పీఎఫ్ డిప్యూటీ కమాండర్ గాయపడ్డారు. గాయపడిన డిప్యూటీ కమాండరును ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి అదనపు బలగాలను రప్పించి గాలిస్తున్నారు.