కొవిడ్ రోగి ఊపిరితిత్తులు అమర్చడంతో.. అమెరికాలో మహిళ మృతి!
ABN , First Publish Date - 2021-02-26T09:32:36+05:30 IST
కొవిడ్ రోగి ఊపిరితిత్తులు అమర్చడంతో.. అమెరికాలో మహిళ మృతి!
మిచిగాన్, ఫిబ్రవరి 25: వైద్యులు చేసిన తప్పిదం ఓ మహిళ ప్రాణం తీసింది. ఆ మహిళకు పొరపాటున కొవిడ్ రోగి ఊపిరితిత్తులను అమర్చడంతో.. శస్త్రచికిత్స జరిగిన రెండు నెలల్లోనే కన్నుమూసింది. ఈ ఘటన అమెరికాలోని మిచెగాన్ నగరంలో జరిగింది. ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు ఊపిరితిత్తులు పాడైపోవడంతో వెంటనే మార్పిడి చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. రోడ్డుప్రమాదం వల్ల బ్రెయిన్డెడ్ అయిన మరో మహిళ ఊపిరితిత్తులను బాధితురాలికి అమర్చాలని డాక్టర్లు నిర్ణయించారు. వెంటనే దాతకు, స్వీకర్త ముక్కు నుంచి స్వాబ్ తీసుకుని పరీక్షించారు. నెగెటివ్ రావడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేశారు.
మూడో రోజే బాధితురాలిలో స్వల్ప జ్వరం రావడంతో మళ్లీ పరీక్షలు చేశారు. ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో దాత స్వాబ్ను మళ్లీ పరీక్షించగా.. పాజిటివ్ వచ్చింది. బాధిత మహిళను బతికించేందుకు యత్నించినా.. ఫలితం లేకపోయింది. ఇలాంటి శస్త్ర చికిత్సలు చేసేటప్పుడు ఊపిరితిత్తుల నుంచి స్వాబ్ తీసుకుని పరీక్షించడమే మేలని నిపుణులు చెప్పారు.