నిమ్మకాయ తెంపినందుకు కోడలితో ఘర్షణకు దిగిన అత్త.. ఇద్దరు కూతుళ్లతో కలిసి హత్య..!

ABN , First Publish Date - 2022-04-28T22:20:57+05:30 IST

ప్రస్తుత వేసవి కాలంలో నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి..

నిమ్మకాయ తెంపినందుకు కోడలితో ఘర్షణకు దిగిన అత్త.. ఇద్దరు కూతుళ్లతో కలిసి హత్య..!

ప్రస్తుత వేసవి కాలంలో నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. ఒక్క నిమ్మకాయ ధర రూ.10కి చేరింది.. నిమ్మకాయల ధరల గురించి సోషల్ మీడియాలో బోలెడన్ని జోక్‌లు పుట్టుకొస్తున్నాయి.. నిమ్మకాయలు చోరీకి గురైన ఘటనలు కూడా వింటున్నాం.. చాలా మంది నిమ్మకాయలను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. తాజాగా బీహార్‌లోని ఓ అత్త నిమ్మకాయల కోసం కోడలినే చంపేసింది.. అనంతరం కూతుళ్లతో కలిసి పరారైంది.


బీహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లా చైన్‌పూర్ గ్రామానికి చెందిన సునీల్ భైతా ఉపాధి కోసం వేరే రాష్ట్రానికి వెళ్లాడు. ఆయన భార్య కాజల్ దేవి (28).. అత్త, మరదళ్లతో పాటు చైన్‌పూర్‌లో నివసిస్తుంటుంది. కాజల్ అత్త చాలా కాలంగా ఇంటి పెరుడులో ఓ నిమ్మ చెట్టును పెంచుతోంది. ఎవరినీ ఆ చెట్టు నుంచి నిమ్మకాయ కోయనిచ్చేది కాదు. బుధవారం ఉదయం కాజల్ ఆ చెట్టు నుంచి ఓ నిమ్మకాయను కోసింది. కాజల్ నిమ్మకాయ తెంపడాన్ని మరదళ్లు చూసి తల్లికి చెప్పారు. తీవ్ర ఆగ్రహానికి గురైన అత్త కాజల్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది. తనను అడక్కుండా నిమ్మకాయ ఎందుకు కోశావని గొడవ పెట్టుకుంది. 


షాక్‌కు గురైన కోడలు అత్తకు ఎదురు తిరిగింది. నిమ్మకాయి కోసినందుకు ఇంత రాద్ధాంతం ఎందుకని నిలదీసింది. దీంతో అత్త మరింత రెచ్చిపోయింది. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి కోడలిపై దాడి చేసింది. క్షణికావేశంలో ఓ తాడును కాజల్ మెడకు బిగించి ఉరేసి చంపేసింది. కోడలు చనిపోయిన తర్వాత కూతుళ్లతో కలిసి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు కాజల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న కాజల్ అత్త, ఆడపడచుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-04-28T22:20:57+05:30 IST