మహిళ కిడ్నాప్ కేసులో ఐదేళ్ల జైలు
ABN , First Publish Date - 2022-05-24T06:14:48+05:30 IST
ఓ మహిళను బెదిరించి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి, మళ్లీ తీసుకొచ్చి స్థానికంగా ఓ ఇంట్లో నిర్బంధించిన ఘటనకు సంబ ంధించిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.
రాజమహేంద్రవరం, మే 23(ఆంధ్రజ్యోతి): ఓ మహిళను బెదిరించి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి, మళ్లీ తీసుకొచ్చి స్థానికంగా ఓ ఇంట్లో నిర్బంధించిన ఘటనకు సంబ ంధించిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఆనందనగర్లో నివసిస్తున్న వివాహితను బర్మా కాలనీకి చెందిన దొమ్మేటి కనకరాజు అలియాస్ కనక పరిచయం చేసుకుని, వేధించేవాడు. ఫోన్లో మాట్లాడుతూ తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. 2015 సెప్టెంబరు 26వ తేదీ రాత్రి ఇంటి వద్ద మహిళ భర్త లేని సమయంలో వచ్చి, ఆమెను బయటకు రావాలని పిలిచి, తనతో రాకపోతే చంపేస్తానని బెదిరించాడు. బయటకు రాగానే, నిర్బంధించి ఆమెను భద్రాచలం తీసుకెళ్లాడు. తర్వాత తీసుకువచ్చి చింతలనామవరంలోని ఓ ఇంటిలో పెట్టి వేధించాడు. దీనిపై ఆమె చేసిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, చార్జ్షీట్ దాఖలు చేసి అప్పటి సీఐ వేంకటేశ్వరరావు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో విచారణ జరిగిన తర్వాత సోమవారం 1వ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎన్.ప్రవీణ్కుమార్ నిందితుడు కనకరాజుకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వెంకటరత్నం వాదించారు.