పాముకాటుతో మహిళ మృతి
ABN , First Publish Date - 2021-02-28T05:28:48+05:30 IST
మండలంలోని ర్యాలమడుగులో శనివారం పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది.
మెదక్ రూరల్, ఫిబ్రవరి 27: మండలంలోని ర్యాలమడుగులో శనివారం పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ర్యాలమడుగు గ్రామానికి చెందిన కమ్మరి చంద్రం భార్య శోభ(30) శుక్రవారం పొలం పనుల కోసం వెళ్లగా మధ్యాహ్నం పాము కాటు వేసింది. వెంటనే కుటుంబీకులు ఆమెను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శోభ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు మెదక్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సకాలంలో మెదక్ ఏరియా ఆసుపత్రికి వచ్చినప్పటికీ వైద్యం అందకపోవడం వల్లనే శోభ మృతి చెందిందని ర్యాలమడుగు గ్రామ మాజీ సర్పంచ్ ఆంజనేయులు ఆరోపించారు. వెంటనే వైద్యులు వైద్యం అందిస్తే ఆమె బతికేదన్నారు. గాంధీకి సిఫార్సు చేయడం వల్ల రవాణాలో మూడు గంటలు ఆలస్యం జరిగిందని, అందుబాటులో సరైన సదుపాయాలు లేకపోవడం శోచనీయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.