మండుటెండలో రైలు కోసం ఎదురు చూస్తూ మహిళ మృతి!
ABN , First Publish Date - 2020-05-27T15:33:05+05:30 IST
లాక్డౌన్ నేపధ్యంలో ఉపాధి కోల్పోవడంతో వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకోవాలని తపన పడుతున్నారు. ఈ నేపధ్యంలో వారు అనేక అవస్థలు పడుతున్నారు. ముంబైలో ఇటువంటిదే ఒక హృదయవిదారక...
ముంబై: లాక్డౌన్ నేపధ్యంలో ఉపాధి కోల్పోవడంతో వలస కూలీలు తమ ఇళ్లకు చేరుకోవాలని తపన పడుతున్నారు. ఈ నేపధ్యంలో వారు అనేక అవస్థలు పడుతున్నారు. ముంబైలో ఇటువంటిదే ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తమ గ్రామంవైపు వెళ్లే రైలు కోసం చుర్రుమనే ఎండలో గంటల తరబడి వేచి చూసింది. ఆ ఎండకు తాళలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అక్కడున్నవారు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యులు పరీక్షించి ఆ మహిళ చనిపోయిందని తేల్చిచెప్పారు. ముంబైలోని వాసాయి వెస్ట్ ప్రాంతంలోని సన్సిటీ గ్రౌండ్ రైల్వే స్టేషన్ వద్దకు విద్యాతోమ శుక్లా (57) అనే మహిళ వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ వెళ్లడానికి ఆమె అక్కడకు వచ్చింది. రైలుకోసం గంటల తరబడి మండుటెండలో వేచి చూసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎదురు చూసినా రైలు రాలేదు. ఇంతలో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమెను గమనించిన పోలీసులు బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.