కళ్యాణి డ్యామ్లో దూకి మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-23T07:01:00+05:30 IST
చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యామ్లోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకొంది.
చంద్రగిరి, జూన్ 22: చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని కళ్యాణి డ్యామ్లోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకొంది. పోలీసుల కథనం మేరకు రేణిగుంట మండలానికి చెందిన ధనమ్మ(45) తిరుపతిలో గంగమ్మగుడి నుంచి బాడుగ ఆటోలో కళ్యాణి డ్యామ్ సందర్శనకు వచ్చారు. ఆటోను డ్యామ్ కింద భాగంలో పెట్టి డ్రైవర్ కార్తీక్ ఆమెకు డ్యామ్ను చూపాడు. అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో ఆమెను డ్యామ్పైన ఉండమని చెప్పి.. కిందకు వెళ్లి ఆటో తీసుకొస్తానని ఆమెకు చెప్పాడు. ఆ ప్రకారం ఆటోని తీసుకొని డ్యామ్పైకి వెళ్ళి చూడగా ధనమ్మ కనిపించలేదు. డ్యామ్లో చూడగా నీళ్ళలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో కార్తీక్ కేకలు వేశాడు. సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాల సిబ్బంది వెళ్ళి చూడగా ధనమ్మ అప్పటికే మృతి చెందింది. పీటీసీ సిబ్బంది చంద్రగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించి, ధనమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.