మ్యాట్రిమోని సైట్లో పరిచయం అయిన యువకుడు.. పెళ్లి చేసుకునేందుకు అతడి వద్దకు వెళ్లిన యువతి.. చివరకు ఏం చేశాడంటే?
ABN , First Publish Date - 2022-04-24T06:04:44+05:30 IST
ఇటీవలి కాలంలో మ్యాట్రిమోని సైట్లలో పెళ్లి సంబంధాలు వెతుక్కోవడం సాధారణ విషయంగా మారింది. అయితే అలా వెతుక్కోవడమే ఒక యువతి ప్రాణాల మీదకు తెచ్చింది...
ఇటీవలి కాలంలో మ్యాట్రిమోని సైట్లలో పెళ్లి సంబంధాలు వెతుక్కోవడం సాధారణ విషయంగా మారింది. అయితే అలా వెతుక్కోవడమే ఒక యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అస్సాంకు చెందిన ఒక యువతికి అంతకుముందే పెళ్లి అయింది. భర్తతో వేగలేక విడాకులు తీసుకుంది. ఆమెకు నాలుగు సంవత్సరాల పాప కూడా ఉంది.
ఇలాంటి సమయంలో జీవితంలో తోడు ముఖ్యమని భావించిన ఆమె.. ఒక మ్యాట్రిమోని సైట్లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేసింది. దాని ద్వారా బిహార్కు చెందిన ప్రిన్స్ రాజా ఆర్య అనే యువకుడు ఆ యువతికి పరిచయం అయ్యాడు. తన భార్య చనిపోయిందని, తను కూడా జీవితంలో తోడు కోసం వెతుకుతున్నానని చెప్పాడు. ఆమెను బిహార్లో తను ఉండే త్రివేణీగంజ్ ప్రాంతానికి పిలిపించుకున్నాడు. దగ్గరలోని ఒక ఆలయంలో ఏడడుగులు వేశాడు. ఆ తర్వాత ఆమెకు, ఆమె కుమార్తెకు నరకం చూపించడం మొదలు పెట్టాడు.
అత్యంత క్రూరంగా ఆమెను హింసిస్తూ.. ఆపై అత్యాచారాలు చేయడం ప్రారంభించాడు. పైగా తను చేసే పనిని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. చివరకు నాలుగేళ్ల పసిపాపను కూడా వదల్లేదు. పాప కాళ్లు, చేతులు కట్టేసి కరెంట్ షాకిచ్చేవాడు. మొదటి భర్త నుంచి ఆమెకు భరణంగా దక్కిన రూ. 7 లక్షలు కూడా కాజేశాడు. ఈ నరకం అనుభవించలేక పారిపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న వాళ్లు వెంటనే కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను వీడియోలు తీసిన మొబైల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.