ఇంట్లో నిద్రిస్తున్న వివాహితపై పదునైన ఆయుధంతో దాడి

ABN , First Publish Date - 2020-03-07T10:06:01+05:30 IST

ఇంట్లో నిద్రపోతున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

ఇంట్లో నిద్రిస్తున్న వివాహితపై పదునైన ఆయుధంతో దాడి

జవహర్‌నగర్‌, మార్చి 6, (ఆంధ్రజ్యోతి): ఇంట్లో నిద్రపోతున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు ఆమె భర్తపై అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. పోలీసు జాగిలాలు ఆమె బావ, తోటికోడలి ఇంటి వరకు వెళ్లి ఆగిపోయాయి. మల్కాజిగిరి జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్‌ మండలం, మహమ్మద్‌పూర్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ జెట్టి శ్రీకాంత్‌ (23)కు.. అదే జిల్లా కోయడ మండలం, చంచల చెరువుపల్లికి చెందిన అంజలి(22)తో రెండేళ్ల క్రితం వివాహం అయింది.


వీరు జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌కాలనీలో నివసిస్తున్నారు. అన్న శ్రీనివాస్‌, వదిన సంధ్య ప్రోద్బలంతో శ్రీకాంత్‌ తన భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. ఈ క్రమంలో.. శుక్రవారం ఉదయం అంజలి దారుణ హత్యకు గురైంది. ఇది అత్తింటివారి పనే అని అంజలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రాత్రంతా క్యాబ్‌ నడిపేందుకు వెళ్లానని, తనకే పాపం తెలియదని శ్రీకాంత్‌ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. 


తమ ఇంట్లో దొంగలు పడి ఉంటారని, వారే తన భార్యను హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. క్లూస్‌టీం అధికారులు పలు ఆధారాలను సేకరించగా.. డాగ్‌స్క్వాడ్‌ జాగిలాలు కాలనీలో పలుచోట్ల తిరుగుతూ.. శ్రీనివాస్‌, సంధ్య ఇంటి వరకు వెళ్లి ఆగిపోయాయి. 

Updated Date - 2020-03-07T10:06:01+05:30 IST