హిజాబ్ తొలగించమన్న పాఠశాల... తమిళనాడు పోలీసుల దర్యాప్తు
ABN , First Publish Date - 2022-04-23T21:29:48+05:30 IST
పాఠశాల ఆవరణలో హిజాబ్ ధరించడాన్ని అనుమతించమంటూ ఈస్ట్ తాంబరంలోని ఓ ప్రైవేటు పాఠశాల సిబ్బంది తమను..
చెన్నై: పాఠశాల ఆవరణలో హిజాబ్ ధరించడాన్ని అనుమతించమంటూ ఈస్ట్ తాంబరంలోని ఓ ప్రైవేటు పాఠశాల సిబ్బంది తమను అడ్డుకుందని ఓ నాలుగేళ్ల బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాంబరం ప్రాంతానికి చెందిన ఆషిఖ్ మీరన్ ఈ ఫిర్యాదు చేశాడు. తమ కుమారుడి ఎల్కేజీ అడ్మిషన్ కోసం తాను, తన భార్య కలిసి పాఠశాలకు వెళ్లామని, పాఠశాల ఆవరణలో హిజాబ్ను అనుమతించమని అక్కడి సిబ్బంది అడ్డుకోవడంతో పాటు తన భార్యను హిజాబ్ తొలగించమన్నారని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
కాగా, ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారం ప్రకారం, పాఠశాల ప్రిన్సిపాల్ సైతం తమ సిబ్బంది ఆదేశాలను సమర్ధించినట్టు సేలయూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. దీనిపై తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి మాట్లాడుతూ, ఇది దురదృష్టకరమైన ఘటన అని అన్నారు. అసలేమి జరిగిందో తెలుసుకుంటామని, తప్పు చేసినట్టు నిర్దారణ అయితే కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినందున వారి నుంచి నివేదక అందగానే చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పొరుగున ఉన్న కర్ణాటకలో హిజాజ్ వివాదం ఉన్నా తమిళనాడులో మాత్రం హిజాబ్తో పాఠాశాలల్లో ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు లేవు.