ఐదుగురు కుమార్తెలతో సహా రైలు ముందు దూకి మహిళ ఆత్మహత్య!
ABN , First Publish Date - 2021-06-10T16:42:00+05:30 IST
ఛత్తీస్గఢ్లో ఒక మహిళ తన ఐదుగురు కుమార్తెలతో సహా...
మహాసముంద్: ఛత్తీస్గఢ్లో ఒక మహిళ తన ఐదుగురు కుమార్తెలతో సహా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. మహాసముంద్ జిల్లాలో ఒక మహిళ తన ఐదుగురు కుమార్తెలతో సహా ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళ పెద్ద కుమార్తె వయస్సు 17 ఏళ్లు, చిన్న కుమార్తెకు 10 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహాసముంద్ పోలీసు సూపరింటెండెంట్ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు.
ఆ మహిళ గత రాత్రి నుండి తన కుమార్తెలతో సహా బయటకు వెళ్లిందని తెలిపారు. దీంతో ఆమె భర్త బంధువుల ఇంట్లో భార్యాపిల్లల కోసం వెదుకుతున్నాడన్నారు. ఇంతలో రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాలు ఉన్న సమాచారం తమకు అందిందని, వెంటనే తాము అక్కడికి వెళ్లి విచారణ చేపట్టామన్నారు. బుధవారం రాత్రి వారి ఇంట్లో ఆహారానికి సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని ఎస్పీ తెలిపారు. ఆ తరువాత మహిళ తన కుమార్తెలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. ప్రాథమికంగా దీనిని ఆత్మహత్య కేసుగా నమోదు చేశామన్నారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేయాల్సివుందన్నారు.