'వోల్ఫ్ హాల్' ట్రయాలజీ రచయిత్రి హిలరీ మాంటెల్ కన్నుమూత
ABN , First Publish Date - 2022-09-24T01:37:02+05:30 IST
ప్రముఖ బ్రిటీష్ రచయిత్రి, బుకర్ ఫ్రైజ్ విజేత హిలరీ మాంటెల్ ను...
లండన్: ప్రముఖ బ్రిటీష్ రచయిత్రి (British novilist), బుకర్ ఫ్రైజ్ (Booker prize) విజేత హిలరీ మాంటెల్ (Hilary Mantel)ను సాహితీ ప్రపంచం కోల్పోయింది. జీవితకాలంలో రెండుసార్లు బుకర్ ప్రైజ్ సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందిన 70 ఏళ్ల మాంటెల్ శుక్రవారంనాడు కన్నుమూశారు. 'వోల్ఫ్ హాల్' ట్రయాలజీ (Wolf Hall' trilogy)లో భాగంగా 'బ్రింగ్ అప్ ది బాడీస్' సిరీస్ వచ్చింది. ఈ రెండు పుస్తకాలకు ఆమె రెండుసార్లు బుకర్ ప్రైజ్ దక్కించుకున్నారు. ఈ సిరీస్లో చివరిదైన 'ది మిర్రర్ అండ్ ది లైట్' 2020లో ప్రచురితమైంది. ఈ పుస్తకాలు అత్యంత ప్రజాదరణ చూరగొనడంతో పాటు టీవీల్లోనూ, రంగస్థలంపైన ప్రదర్శితమయ్యాయి. 'వోల్ఫ్ హాల్' ట్రయాలజీ 42 భాషల్లో అనువాదమైంది. 50 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయాయి.
హిలరీ మాంటెల్ తన కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో తుదిశ్వాస విడిచినట్టు పబ్లిషింగ్ కంపెనీ హాపర్ కాల్సిన్ ప్రకటించింది. మన ప్రియతమ రచయిత్రి హిలరీ మాంటెల్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఎంతో బాధాకరమని హాపర్కాలిన్స్కు చెందిన ప్రచురణ సంస్ధ ఫోర్త్ ఎస్టేట్ బుక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆమె లేని లోటు తీరదని, ఆమె అందించిన సాహితీ సేవ, అందుకు పడిన కష్టం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపింది. డెర్బీషైర్లో జన్మించిన మాంటెల్... లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారు. లండన్లో లిటరరీ కెరీర్ ప్రారంభించడానికి ముందు బోత్స్వానా, సౌదీ అరేబియాలో పనిచేశారు. మాంటెల్ భర్త గెరాల్డ్ మెక్వెన్ జీవించే ఉన్నారు.