కఠారి దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు

ABN , First Publish Date - 2022-06-24T07:56:45+05:30 IST

చిత్తూరు మేయర్‌ కటారి అనురాధ, మోహన్‌ దంపతుల హత్యకేసులో సాక్షులను బెదిరిస్తున్నారని మాజీ మేయర్‌ కటారి హేమలత ఆరోపించారు.

కఠారి దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు
విలేకరుల సమావేశంలో కటారి కుటుంబ సభ్యులు

- రక్షణ కల్పించాలని మాజీ మేయర్‌ కఠారి హేమలత విజ్ఞప్తి

చిత్తూరు సిటీ, జూన్‌ 23: చిత్తూరు మేయర్‌ కటారి అనురాధ, మోహన్‌ దంపతుల హత్యకేసులో సాక్షులను బెదిరిస్తున్నారని మాజీ మేయర్‌ కటారి హేమలత ఆరోపించారు. చిత్తూరులోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఆమె కుటుంబ సభ్యులు, సాక్షులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో 2015 నవంబరు 17న అనురాధ, మోహన్‌ అతి దారుణంగా హత్యకు గురయ్యారన్నారు. ఈ కేసు ఏడేళ్లుగా కోర్టులో నడుస్తోందని, గతంలో పలుమార్లు కేసు విచారణకు స్వీకరించినపుడు నిందితులు ఏదోరకంగా కేసును వాయిదా వేస్తూ వచ్చారన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి హైకోర్టులో విచారణకు షెడ్యూల్‌ ఖారారైన నేపథ్యంలో ప్రధాన నిందితుడైన చింటూతో పాటు అతడి నిందితుడు బుల్లెట్‌ సురేష్‌, అనుచరులైన కార్పొరేటర్‌ శ్రీకాంత్‌, సాయిగణేష్‌, గుర్రప్ప నాయుడు, పరంధామ, మరికొందరు కలిసి సాక్షులను బెదిరిస్తున్నట్లు చెప్పారు. ‘డబ్బుకు లొంగిపోండి. లేకపోతే కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేస్తాం, వ్యాపారాలను దెబ్బతీస్తాం’ అని బెదిరిస్తున్నట్లు హేమలత పేర్కొన్నారు. దీనిపై సీఐ, డీఎస్పీ, ఎస్పీ, డీఐజీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. సాక్షులు మనస్సాక్షిగా, నిష్పక్షపాతంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని నిందితులు బెదిరిస్తున్నారని చెప్పారు. సాక్షులకు, తమ కుటుంబ సభ్యులకు కూడా చింటూ అనుచరుల వల్ల ప్రాణహాని ఉందన్నారు. పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. తన అన్న కటారి ప్రవీణ్‌ మరణం తర్వాత తమకు ఏ అండ లేదని, మహిళలే కదా అని ఇబ్బందులకు గురి చేస్తున్నారని లావణ్య ఆవేదన వ్యక్తంచేశారు. కొంత మంది సాక్షులను ప్రలోభపెట్టి నిందితులు వారి వైపు తిప్పుకున్నారన్నారన్నారు. మిగిలిన వారినీ తిప్పుకునేందుకు బెదిరిస్తున్నారని ఆరోపించారు. 


Updated Date - 2022-06-24T07:56:45+05:30 IST