ఉద్యోగం చేయకుండానే నెలకు రూ.85వేల జీతం
ABN , First Publish Date - 2021-11-12T15:01:39+05:30 IST
నెలనెలా రూ.85వేల జీతం..
విలియమ్స్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
నల్లగొండ: నల్లగొండలోని చర్చికి వచ్చే యువతులను మాయమాటలతో మోసంచేసిన వాయిద్యకారుడు తలకొప్పుల శామ్యూల్ విలియమ్స్ తప్పుడు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నార్కట్పల్లి పీహెచ్సీ ల్యాబ్టెక్నీషియన్ అయిన విలియమ్స్ విధులకు హాజరుకాకుండానే నెలనెలా రూ.85వేల జీతం తీసుకునేవాడు. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ చర్చి తరఫున నిర్వహించే కార్యక్రమాలకు రాజకీయ నాయకులను పిలిపించి వారితో ఫొటోలు దిగుతూ సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకునేవాడు. ఆ ఫొటోలు చూపి పైస్థాయి అధికారులను బెదిరించేవాడన్న ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇటీవల నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తాను వైద్య, ఆరోగ్యశాఖలో ఉన్నత ఉద్యోగిగా సెక్యూరిటీ అధికారులను నమ్మించి గవర్నర్కు పుష్పగుచ్ఛం అందజేశాడు. విలియమ్స్ లీలల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో కొండల్రావు చెప్పారు.