కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో అధికార మార్పిడి అసాధ్యం : ఏకే ఆంటోనీ

ABN , First Publish Date - 2022-04-28T01:50:46+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పాత్రను పోషించకుండా

కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో అధికార మార్పిడి అసాధ్యం : ఏకే ఆంటోనీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పాత్రను పోషించకుండా కేంద్రంలో అధికార మార్పిడి సాధ్యం కాదని ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ చెప్పారు. నెహ్రూ-గాంధీ కుటుంబం అత్యంత పలుకుబడి, అధికారంగల కేంద్రమని తెలిపారు. ఆ కుటుంబం కాంగ్రెస్‌కు మార్గదర్శనం చేసే శక్తి అని పేర్కొన్నారు. ఆ కుటుంబీకులు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో 99 శాతం మందికి ఆ పార్టీ ఆమోదయోగ్యం కాదన్నారు. 


కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఆంటోనీ బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పాత్రను పోషించకుండా కేంద్రంలో అధికార మార్పిడి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ లేకుండా ఢిల్లీలో అధికార మార్పిడి గురించి ఊహించలేరన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం ఓ పవర్‌హౌస్ వంటిదని, పార్టీకి మార్గదర్శనం చేసే చోదక శక్తి అని తెలిపారు. నెహ్రూ-గాంధీ కుటుంబీకులు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో 99 శాతం మందికి పార్టీ ఆమోదయోగ్యం కాదన్నారు. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయవద్దని కోరారు. ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందన్నారు. 


2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని చెప్పారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఇటీవలి మత ఘర్షణల గురించి ప్రస్తావిస్తూ, దేశంలో నేటి పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. అన్ని మతాలు, కులాలు, జాతులు, వేర్వేరు భాషలకు చెందినవారు అభివృద్ధి చెందగలిగే దేశం భారత్ ఒక్కటేనన్నారు.


Updated Date - 2022-04-28T01:50:46+05:30 IST