నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది
ABN , First Publish Date - 2021-04-03T21:40:40+05:30 IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 77 నామినేషన్లు దాఖలు కాగా, పలు కార ణాలతో 17 మంది
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది నిలిచారు. ఈ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 77 నామినేషన్లు దాఖలు కాగా, పలు కార ణాలతో 17 మంది నామినేషన్లు తిరస్కరించారు. బీజేపీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి నివేదితారెడ్డి, ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి కుతుబుద్ధిన్లు తిరస్కరణ జాబితాలో ఉన్నారు. 19 మంది అభ్యర్థులు నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. ఉపఎన్నిక నిర్వహణ తీరుపై జిల్లా ఎన్నికల అధికారి పీజేపాటిల్, ఎస్పీ ఏవీ రంగనాథ్లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సాగర్లో మకాం వేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు అణువణువు పరిశీలిస్తున్నారు. మద్యం, మనీ పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ఉప ఎన్నిక పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రాహుల్సింగ్ 29వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. బుధవారం ప్రభుత్వ అతిథి గృహంలోనే చికిత్స తీసుకున్న ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించారు. ఆయన స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం సజ్జన్సింగ్ ఆర్ చవాన్ను పరిశీలకుడిగా నియమించింది.