కరోనా రెడ్ జోన్‌గా ధారావీ మురికివాడ

ABN , First Publish Date - 2020-04-09T14:31:15+05:30 IST

ముంబై ధారావీ మురికివాడలో కరోనా చికిత్సలో ఉన్నవారిసంఖ్య పెరుగుతుండటంతో బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా...

కరోనా రెడ్ జోన్‌గా ధారావీ మురికివాడ

ముంబై : ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ముంబై ధారావీ మురికివాడలో కరోనా చికిత్సలో ఉన్నవారిసంఖ్య పెరుగుతుండటంతో బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. చదరపు కిలోమీటరుకు 66వేల మంది జనసాంద్రత ఉన్న ధారావీ అతిపెద్ద మురికివాడలో 13 మందికి కరోనా సోకింది.240 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ మురికివాడలో ఇద్దరు కరోనాతో మరణించడంతో మున్సిపల్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.


ధారావీలో 8.5 లక్షల మంది జనాభా నివశిస్తుండటంతో కరోనా ప్రబలకుండా ఆరోగ్యశాఖ వాలంటీర్లు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ మురికివాడలో 250 చదరపు అడుగుల 57వేల ఇళ్లలో సగటున 10 నుంచి 12 మంంది నివశిస్తున్నందు వల్ల వారి మధ్య సామాజిక దూరం పాటించడం అసాధ్యంగా మారింది. ధారావీలో గుండె జబ్బులు, శ్వాసకోస సమస్యలు, రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలున్న వారికి కరోనా సోకే ప్రమాదం ఉన్నందున వారిని ఆరోగ్యశాఖ కార్యకర్తలు ఇంటింటి సర్వేతో గుర్తించారు. కరోనా చికిత్సలో ఉన్నవారి ఇళ్లకు మున్సిపల్ అధికారులు సీలు వేశారు. కరోనా లక్షణాలున్న వారిని ఆసుపత్రులకు తరలించి పరీక్షలు చేస్తున్నారు. 

Updated Date - 2020-04-09T14:31:15+05:30 IST