కరోనా జాగ్రత్తలతో.. మక్కా మసీదులో ప్రార్థనలు

ABN , First Publish Date - 2021-05-08T09:16:43+05:30 IST

రంజాన్‌ మాసంలో వచ్చే చివరి శుక్రవారం ‘జుమ్మతుల్‌ విదా’ ప్రార్థనల్లో ఈ ఏడాది మక్కామసీదు బోసిపోయింది.

కరోనా జాగ్రత్తలతో.. మక్కా మసీదులో ప్రార్థనలు

  • ‘జుమ్మతుల్‌ విదా’కు 4వేల మందే
  • కరోనా అంతం కావాలని ప్రార్థించండి: సీపీ వినతి

హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసంలో వచ్చే చివరి శుక్రవారం ‘జుమ్మతుల్‌ విదా’ ప్రార్థనల్లో ఈ ఏడాది మక్కామసీదు బోసిపోయింది. ఏటా మసీదు లోపలి భాగంలో 10వేల మందికి పైగా ప్రార్థనలు నిర్వహిస్తుండగా... బయట మక్కామసీదు ఎదురుగా, చార్మినార్‌, గుల్జార్‌హౌజ్‌, లాడ్‌బజార్‌, చౌక్‌, పంచ్‌మొహల్లా, మొగల్‌పురా వరకు రోడ్లపైనే షామియానాలు పరిచి లక్ష మందికి పైగా జనం జుమ్మతుల్‌ విదా న మాజు నిర్వహించడం ఆనవాయితీ. కరోనా కారణంగా చారిత్రక మక్కా మసీదులో జుమ్మతుల్‌ విదా ప్రార్థనలకు సుమారు 4వేల మందే హాజరయ్యారు. మాస్కులుధరించి, భౌతిక దూరం పాటిస్తూ మసీదు లోపలే నమాజ్‌లు చేశారు. కాగా, రంజాన్‌ పండుగ (ఈదుల్‌ ఫితర్‌)కు ముందు వచ్చే జుమ్మతుల్‌ విదాతో పండుగ ఏర్పాట్లు ప్రారంభమవుతాయంటూ ముస్లిం సోదరులకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు తీసుకోవాల్సిన జా గ్రత్తల దృష్ట్యా ఈ ఏడాది ఇళ్లకు సమీపంలో ఉన్న మసీదుల్లోనే ప్రార్థనలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిని ప్రభావితం చేస్తున్న కరోనాను అంతమొందించాలని అల్లా్‌హను ప్రార్థించాలని కోరారు. 

Updated Date - 2021-05-08T09:16:43+05:30 IST