ఎన్నికల ముంగిట రిపబ్లికన్ నేతలకు షాక్.. పంజా విసిరిన హ్యాకర్లు!

ABN , First Publish Date - 2020-10-31T00:30:01+05:30 IST

ఎన్నికల ఖర్చు కోసం రిపబ్లికన్ నేతలు కూడబెట్టిన డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన విస్కాన్సిన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను డి

ఎన్నికల ముంగిట రిపబ్లికన్ నేతలకు షాక్.. పంజా విసిరిన హ్యాకర్లు!

వాషింగ్టన్: ఎన్నికల ఖర్చు కోసం రిపబ్లికన్ నేతలు కూడబెట్టిన డబ్బును సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన విస్కాన్సిన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేసే రాష్ట్రాల్లో విస్కాన్సిన్ కూడా ఒకటి. ఈ విస్కాన్సిన్‌లో 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు ఈ రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఎన్నికల నేపథ్యంలో విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఖర్చు చేయడం కోసం రిపబ్లికన్ పార్టీ నేతలు విరాళాల రూపంలో భారీగా డబ్బును సేకరించారు. ఆ డబ్బును పార్టీ బ్యాంక్ అకౌంట్‌లో జమచేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ నేతలకు షాకిస్తూ.. పార్టీ అకౌంట్‌లో జమ చేసిన డబ్బును సైబర్ నేరగాళ్లు దొంగిలించారు. ఈ విషయాన్ని స్వయంగా రిపబ్లికన్ పార్టీ చైర్మన్ ఆండ్రూ హిట్టే తెలిపారు. విస్కాన్సిన్ రిపబ్లికన్ పార్టీ అకౌంట్‌ నుంచి సుమారు 2.3 మిలియన్ డాలర్లను హ్యాకర్లు కాజేశారని వెల్లడించారు. అక్టోబర్ 22న అనుమానాస్పద లావాదేవీలు జరిగనట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎఫ్‌బీఐ దర్యాప్తును కూడా ప్రారంభించిందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-31T00:30:01+05:30 IST