కరోనా కేసులు, మంచు ఎఫెక్ట్ : లడఖ్లో tourism activitiesకు బ్రేక్
ABN , First Publish Date - 2022-01-10T16:01:04+05:30 IST
కరోనా కేసుల పెరుగుదల, విస్తారంగా కురుస్తున్న మంచు ప్రభావం వల్ల లేహ్, లడఖ్ ప్రాంతాల్లో వింటర్ సీజన్ పర్యాటక కార్యకలాపాలకు బ్రేక్ పడింది...
లడఖ్ (జమ్మూకశ్మీర్): కరోనా కేసుల పెరుగుదల, విస్తారంగా కురుస్తున్న మంచు ప్రభావం వల్ల లేహ్, లడఖ్ ప్రాంతాల్లో వింటర్ సీజన్ పర్యాటక కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేహ్ లడఖ్ ప్రాంతాల్లో ప్రతి ఏటా వేలాది పర్యాటకులు పర్యటిస్తుంటారు. ఈ ఏడాది కరోనా కేసుల పెరుగుదల, విస్తారంగా కురుస్తున్న మంచు వల్ల జిల్లాలో శీతకాలంలో పర్యాటక కార్యకలాపాలను నిలిపివేయాలని లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ శ్రీకాంత్ బాలాసాహెబ్ సూసే ఆదేశాలు జారీ చేశారు. లేహ్ జిల్లాలోని జన్స్కర్ ప్రాంతంలో శీతకాలంలో చాదర్ ట్రెక్ సందర్భంగా సాహస పర్యాటకులతో కళకళలాడుతోంది. ఆదివారం లడఖ్ ప్రాంతంలో 59 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో కరోనా రోగుల సంఖ్య 22,472కు పెరిగింది. లేహ్ లో 221 మంది, కార్గిల్ లో 58 మంది కరోనాతో మరణించారు. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్గా ఉన్న శ్రీకాంత్ బాలాసాహెబ్ సూసే ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఏడాది లేహ్ ప్రాంతంలో అధికంగా కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు ఈ ఏడాది పర్యాటక కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు.