‘జెట్’కు మళ్లీ రెక్కలు!
ABN , First Publish Date - 2020-10-18T06:51:54+05:30 IST
దివాలా తీసిన జెట్ ఎయిర్వే్సకు పునరుజ్జీ వం లభించింది. ఎయిర్లైన్స్ విమానాలు కొత్త రెక్కలు తొడిగి త్వరలోనే గాల్లోకి ఎగరనున్నా యి.
కల్రాక్ క్యాపిటల్, మురారీ జలాన్
చేతికి ఎయిర్లైన్స్
పునరుజ్జీవ ప్రణాళికకు
రుణదాతల కమిటీ ఆమోదం
ముంబై: దివాలా తీసిన జెట్ ఎయిర్వే్సకు పునరుజ్జీ వం లభించింది. ఎయిర్లైన్స్ విమానాలు కొత్త రెక్కలు తొడిగి త్వరలోనే గాల్లోకి ఎగరనున్నా యి. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా ఈ విమాన సంస్థ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. కల్రాక్ క్యాపిటల్-మురారీ లాల్ జలాన్ కన్సార్షియం సమర్పించిన దివాలా పరిష్కార ప్రణాళికకు జెట్ ఎయిర్వేస్ రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదం తెలిపింది.
శనివారంతో ముగిసిన ఈ-ఓటింగ్ ప్రక్రియలో ఈ కన్సార్షియం బిడ్ను సీఓసీ ఆమోదించిందని జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) ఆశిష్ చావ్చారియా తెలిపారు. ఇక ఈ ప్రణాళికను జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించాల్సి ఉంటుం ది. ఆ తర్వాత పౌర విమానయానం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలూ గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.
దేశంలోని మొదటి తరం విమానయాన కంపెనీల్లో జెట్ఎయిర్వేస్ ఒకటి. నెం.1 ప్రైవేట్ విమాన సంస్థగా ఎదిగిన జెట్.. ఇండిగో సహా పలు బడ్జెట్ ఎయిర్లైన్స్ రాకతో డీలా పడింది. ముడి చమురు ధరల పెరుగుదల, నిర్వహణ వ్యయాల కట్టడి వైఫల్యాల కారణంగా ఆర్థికంగా దివాలా తీసింది. నిధుల కొరతతో చివరికి ఉద్యోగుల జీతాలు కూడా చెల్లించలేని స్థాయికి దిగజారింది. విమాన సర్వీసులనూ క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది.
అత్యవసర నిధుల మంజూరుకు రుణదాతలు నిరాకరించడంతో 2019 ఏప్రిల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. జెట్కు రుణాలిచ్చిన బ్యాంక్లు గత ఏడాది జూన్లో దివాలా పరిష్కార చర్యలు ప్రారంభించాయి.
బ్యాంకులకు భారీ గండి
‘జెట్’కు రుణాలిచ్చిన బ్యాంక్లు, ఇతర ఆర్థిక సంస్థలు, థర్డ్పార్టీ సేవలందించిన ఆపరేషనల్ క్రెడిటార్లు, ఉద్యోగులు క్లెయిమ్ చేసిన మొత్తం బకాయిలు రూ.40,000 కోట్ల పైమాటే. అందులో దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్పీ) అంగీకరించిన బకాయిలు రూ.15,525 కోట్లు మాత్రమే.
ఆర్థిక రుణదాతల్లో ఎస్బీఐ, యెస్ బ్యాంక్ తదితరులు రూ.11,344 కోట్ల బకాయిలు క్లెయిమ్ చేయగా.. రూ.7,459.80 కోట్లకు మాత్రమే ఆర్పీ ఆమోదం లభించింది. ఈ ప్రకారంగా, జెట్కు రుణాలిచ్చిన బ్యాంక్లకు బకాయిల రికవరీలో భారీ గండి పడనుంది.
కన్సార్షియం గురించి..
కల్రాక్ క్యాపిటల్: యూర్పకు చెందిన పారిశ్రామికవేత్త ఫ్లోరియన్ ఫ్రిట్ష్ ఈ కంపెనీని స్థాపించారు. ఈ ఫైనాన్షియల్ అడ్వైజరీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రధానంగా రియల్ ఎస్టేట్, వెంచర్ క్యాపిటల్ ఇన్వె్స్టమెంట్పై దృష్టిసారించింది.
మురారీ లాల్ జలాన్: దుబాయ్కి చెందిన పారిశ్రామికవేత్త. యూఏఈ, భారత్, రష్యా, ఉజ్బెకిస్థాన్లోని రియల్ ఎస్టేట్, మైనింగ్, పేపర్ ట్రేడింగ్, ఎఫ్ఎంసీజీ వ్యాపారాల్లో పెట్టుబడులున్నాయి. కుటుంబ వ్యాపారమైన పేపర్ ట్రేడింగ్ ద్వారా 1980లో జలాన్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
కీలక మైలురాళ్లు
2019
ఏప్రిల్ : ఎయిర్లైన్స్ కార్యకలాపాల నిలిపివేత
జూన్ : దివాలా చర్యలు ప్రారంభం
సెప్టెంబరు: ఆసక్తి కనబర్చిన సినర్జీ గ్రూప్. కానీ, దివాలా పరిష్కార ప్రణాళిక సమర్పణలో విఫలం
2020
జనవరి : మళ్లీ బిడ్లు ఆహ్వానించిన ఆర్పీ
ఫిబ్రవరి : ముగ్గురు ఇన్వెసర్లు ఆసక్తి, పరిష్కార ప్రణాళిక సమర్పించడంలో వైఫల్యం
మార్చి : దివాలా పరిష్కారానికి ఎన్సీఎల్టీని 3 నెలల అదనపు గడువు కోరిన ఆర్పీ
ఏప్రిల్ : దివాలా ప్రక్రియ గడవు ఆగస్టు 21 వరకు పెంపు
మే : మళ్లీ బిడ్ల ఆహ్వానం. ఆసక్తి వ్యక్తీకరించిన 12 మంది ఇన్వెస్టర్లు
జూన్ : డజనులో 4 షార్ట్లిస్ట్
జూలై: దివాలా పరిష్కార ప్రణాళికను సమర్పించిన ఇద్దరు బిడ్డర్లు
ఆగస్టు : లాక్డౌన్ ఆంక్షల కారణంగా జాప్యం
సెప్టెంబరు: జెట్ రుణదాతలతో చర్చల అనంతరం ప్రణాళికలో తదనుగుణంగా మార్పులు చేసిన బిడ్డర్లు
అక్టోబరు: తుది బిడ్డర్ ఎంపికకు ఈ-ఓటింగ్ ప్రారంభం, మెజారిటీ ఓట్లతో కల్రాక్ క్యాపిటల్-మురారీ జలాన్ కన్సార్షియం బిడ్కు ఆమోదం