సరిహద్దులో మద్యం షాపుల బంద్!
ABN , First Publish Date - 2021-03-06T04:40:03+05:30 IST
తమిళనాడు సరిహద్దులో సూళ్లూరుపేట ఉన్నందున ఇక్కడ పోలింగ్ సందర్భంగా సరిహద్దుల్లోని మద్యం షాపులను మూసివేయాలని ఆ రాష్ట్ర అధికారులను కోరినట్లు కలెక్టర్ చక్రధర్బాబు తెలిపారు.
సూళ్లూరుపేట, మార్చి 5 : తమిళనాడు సరిహద్దులో సూళ్లూరుపేట ఉన్నందున ఇక్కడ పోలింగ్ సందర్భంగా సరిహద్దుల్లోని మద్యం షాపులను మూసివేయాలని ఆ రాష్ట్ర అధికారులను కోరినట్లు కలెక్టర్ చక్రధర్బాబు తెలిపారు. శుక్రవారం సూళ్లూరుపేట జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అక్కడి స్ట్రాంగ్ రూమును, కౌంటింగ్హాల్ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు మున్సిపాలిటీలలో 1.75 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వీరందరూ స్వేచ్ఛగా ఓటు వేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు 400 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ నెల 10వ తేదీ పోలింగ్ జరగనున్నందున 44 గంటలముందే ప్రచారం నిలిపివేయించి, మద్యం దుకాణాలను బంద్ చేయిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ కర్మాగారాలలో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పరిశ్రమల నిర్వాహకులకు సూచించినట్లు చెప్పారు. అలా వీలుకాని పక్షంలో ఓటు వేసుకునేందుకు కనీసం 3 గంటలు అనుమతి ఇవ్వాలని తెలియజేశామన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.విఘ్నేష్ అప్పావు, నాయుడుపేట ఆర్డీవో సరోజిని, మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్, తహసీల్దారు రవికుమార్ కలెక్టర్ వెంట ఉన్నారు.