ఇస్తారా.. ఇవ్వరా..!
ABN , First Publish Date - 2022-09-23T06:03:54+05:30 IST
ఉచిత పంటల బీమాపై సందిగ్ధత వీడటంలేదు. జాబితాలో పేరున్నా బీమా సొమ్ము జమచేయకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇస్తారా.. ఇవ్వరా..!
పంటల బీమాపై సందిగ్ధత
అర్హత ఉన్నా.. జాబితాలో దక్కని చోటు
జాబితాలో పేరున్నా.. జమకాని సొమ్ము
ప్రత్యేక స్పందనలో అర్జీల స్వీకరణ
నెలలు గడుస్తున్నా పరిష్కారం ఏదీ..?
అనంతపురం అర్బన: ఉచిత పంటల బీమాపై సందిగ్ధత వీడటంలేదు. జాబితాలో పేరున్నా బీమా సొమ్ము జమచేయకపోవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జూన 14న సీఎం జగన శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి బహిరరంగ సభలో బటననొక్కి ఉచిత పంటల బీమాను విడుదల చేశారు. అయినా ఇంకా చాలామందికి సొమ్ము జమ కాకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ కార్యాలయాలు, ఆర్బీకేల చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు. తమకేమీ తెలియదని, విజయవాడలోని వ్యవసాయశాఖ కమిషనరేట్ ఆఫీ్సకు వెళ్లి అడగాలని కొన్నిచోట్ల అధికారులు రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు.
ఎదురుచూపు
గత ఏడాది ఖరీఫ్ పంటలు సాగుచేసిన 2.32 లక్షల మంది రైతులకు రూ.629.77 కోట్ల బీమా వర్తింపజేశారు. ఆ జాబితాలో పేరున్న వేలాదిమందికి ఇప్పటికీ సొమ్ము జమచేయలేదు. వీరి పేర్లను సస్పెక్ట్, హోల్డ్లో పెట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బోరు బావి, కాలువల కింద వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఈ వివరాలను ఈ-క్రా్పలో నమోదు చేసుంటే బీమా వర్తించేది. కానీ ఆర్బీకే సిబ్బంది అదర్స్ కింద చూపారు. దీంతో రైతులకు బీమా అందలేదు. అధికారులు ఆనలైనలో మళ్లీ అప్లోడ్ చేసి పంపినా పరిహారం అందలేదు.
అయోమయం
అర్హత ఉన్నా బీమా వర్తించని రైతులు జిల్లా అంతటా ఆందోళనకు దిగారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఎదుట నిరసనలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక స్పందన పేరుతో జిల్లా యంత్రాంగం అర్జీలు స్వీకరించింది. జిల్లాలో 11,974 మంది అర్జీలు ఇచ్చారు. ఇందులో 4,765 అర్జీలను పరిష్కరించదగినవిగా అధికారులు గుర్తించారు. 7,209 అర్జీలను తిరస్కరించారు. గత ఏడాది ఈ-క్రాపింగ్, ఈ-కేవైసీ చేయించిన రైతుల అర్జీలను ఆనలైనలో అప్లోడ్ చేశారు. వీరికి పరిహారం ఎప్పుడు అందుతుందో తెలియడం లేదు. దీంతోపాటు సస్పెక్ట్, హోల్డ్లో ఉన్న రైతుల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది.
బ్లాక్ లిస్టులో పడేశారు..
నేను 22 ఎకరాల్లో మిరప పంట సాగు చేశాను. అధిక వర్షాలకు పంట నాశనమై పూర్తిగా నష్ట పోయాం. పంటల బీమా జాబితాలో పేరు వచ్చింది. అయినా డబ్బులు జమకాలేదు. నా పేరును బ్లాక్ లిస్టులో పడేసి మిన్నకుండిపోయారు. అర్హత ఉన్నా ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టారో ఎవరూ చెప్పడం లేదు. ప్రత్యేక గ్రీవెన్సలో కూడా అర్జీ ఇచ్చాను. ఇంత వరకు పరిహారం జమ కాలేదు.
- నె ట్టెం సుధాకర్, పెద్దముష్టూరు, ఉరవకొండ మండలం
అన్యాయం చేశారు..
ఐదెకరాల్లో మిరప సాగు చేశాను. అధిక వర్షానికి పంటంతా పొలంలోనే దెబ్బతింది. కూలి ఖర్చులకు కూడా డబ్బులు రాలేదు. ఈ-క్రాపింగ్, ఈ-కేవైసీ కూడా చేయించాను. పంట పూర్తిగా దెబ్బతిన్నా బీమా ఇవ్వకుండా అన్యాయం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
- బీమప్ప, ఉరవకొండ