లక్ష్యం చేరేనా?
ABN , First Publish Date - 2022-08-18T06:03:44+05:30 IST
నిజాంసాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో లక్ష్యం దిశగా చేప పిల్లల ఉత్పత్తి జరుగడం లేదు. కోటి చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అధికార యంత్రాంగం లక్ష్యం పెట్టుకున్నా కేంద్రంలో 48 లక్షల చేప పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. మరో 52 లక్షల చేప పిల్లలను ఎక్కడి నుంచి సమకూరుస్తారోనని అంతుపట్టడం లేదు.
ఫ నిజాంసాగర్ చేప ఉత్పత్తి కేంద్రంలో కోటి పిల్లల ఉత్పత్తికి 48 లక్షలేనా?
ఫ అంతంత మాత్రంగానే చిరు చేప పిల్లల ఉత్పత్తి
ఫ లక్ష్యం దిశగా అడుగులు వేసేనా?
నిజాంసాగర్, ఆగస్టు 17: నిజాంసాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో లక్ష్యం దిశగా చేప పిల్లల ఉత్పత్తి జరుగడం లేదు. కోటి చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అధికార యంత్రాంగం లక్ష్యం పెట్టుకున్నా కేంద్రంలో 48 లక్షల చేప పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. మరో 52 లక్షల చేప పిల్లలను ఎక్కడి నుంచి సమకూరుస్తారోనని అంతుపట్టడం లేదు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేప పిల్లల స్పాన్ను తీసుకుని వచ్చి కోటి చేప పిల్లలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేంద్రంలో లక్ష్యం చేరువలో చేప పిల్లలు ఉత్పత్తి కావడం లేదు. కేవలం నిజాంసాగర్లోనే వదులుతారా, జిల్లాలోని 675 చెరువుల్లో వదులుతారా అని ప్రశ్నార్థకంగా మారింది. చేప పిల్లలను వందశాతం రాయితీపై గత 4 సంవత్సరాలుగా బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నారు. జిల్లాలో ప్రాజెక్టులు, చెరువుల్లో 2కోట్ల 75లక్షల చేప పిల్లలను విడుదల చేసేందుకు రెండు ఏజన్సీల ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. కానీ, చేప పిల్లల విడుదల కార్యక్రమం ఖరారు కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఉభయ జిల్లాలో రెండు ఏజెన్సీలు చేప పిల్లల విడుదలను కైవసం చేసుకుని సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తేదీని ఖరారు చేయలేక పోయింది. జిల్లాలో 2కోట్ల 75లక్షల చేప పిల్లలే కాకుండా నిజాంసాగర్ ప్రాజెక్టులో రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అధికార యంత్రాంగాన్ని చేప పిల్లల విడుదలపై ఖరారు చేయకపోవడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా నిజాంసాగర్లో కోటి చేప పిల్లల ఉత్పత్తికి గాను 48 లక్షలు ఉత్పత్తి చేశారే తప్ప 52 లక్షల చేప పిల్లలను రికార్డుల్లోనే స్తబ్దుగా ఉండటం గమనార్హం.