పల్లెల దశ మారేనా?
ABN , First Publish Date - 2021-06-14T05:11:01+05:30 IST
ఆర్థిక సంఘం నిధులను వచ్చే ఏడాది మార్చిలోగా ఖర్చు చేసుకొనేందుకు కేంద్రం ఇచ్చిన వెసులుబాటు పంచాతీయలకు వరం కానుంది. కొత్త పాలకవర్గాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించవచ్చు.
మౌలిక సౌకర్యాల కల్పనకు అవకాశం
స్వచ్ఛ సంకల్పానికి ప్రణాళిక
నేడు మంత్రి వీడియో కాన్ఫరెన్స్
సర్పంచుల చెక్ పవర్కు తొలగిన అడ్డంకులు
విజయనగరం (ఆంధ్రజ్యోతి) / కొమరాడ, జూన్ 13:
ఆర్థిక సంఘం నిధులను వచ్చే ఏడాది మార్చిలోగా ఖర్చు చేసుకొనేందుకు కేంద్రం ఇచ్చిన వెసులుబాటు పంచాతీయలకు వరం కానుంది. కొత్త పాలకవర్గాలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించవచ్చు. ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై సలహాలు ఇచ్చేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనిపై సోమవారం ఉదయం 11 గంటలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
కొత్త సర్పంచ్లకు ఇటీవలే చెక్ పవర్ దక్కింది. దీంతో గ్రామాల్లో పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
నిన్నటివరకు సర్పంచ్ల్లో ఓ నిరాశ ఉండేది. ఎన్నికై నెలలు గడిచినా చెక్ పవర్ రాలేదని, పనులు పేరుకుపోయాయని వాపోయేవారు. నిధుల సమస్య కారణంగా ఓ పని జోలికి వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులు ఖర్చు చేసే అధికారం దక్కడంతో పనులు పట్టాలెక్కించే అవకాశం ఉంది. కాగా సీఎఫ్ఎంఎస్(కాంప్రహెన్సి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ) ఐడీలు ఉంటే తప్ప నిధులు డ్రా చేసుకొనేందుకు వీలుపడదు. సర్పంచ్లకు ఐడీలు కేటాయించేందుకు మండలస్థాయిలో సమాచారం సేకరించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ మేరకు జిల్లాలో 850 పంచాయతీ సర్పంచ్లకు సీఎఫ్ఎంఎస్ గుర్తింపు ఐడీలు మంజూరు కాగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల 102 గ్రామ పంచాయతీలకు ఐడీలు నిలిచిపోయాయి. వీటికి కూడా వారం రోజుల్లో సీఎఫ్ఎంఎస్ ఐడీలు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నిబంధనలకు లోబడే ఖర్చు చేయాలి
సర్పంచ్లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సర్పంచ్ల సీఎఫ్ఎంఎస్ ఐడీలు వచ్చాయి. రానివారికి కూడా వారం రోజుల్లోగా వస్తాయి. గ్రామాల్లో పారిశుధ్యం, ఆరోగ్యంపై సర్పంచ్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. వస్తున్నది వర్షా కాలం కావడం మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.
- ఎం.గోపాలకృష్ణ, ఎంపీడీవో, కొమరాడ