గ్యాస్ ధరలపై మాట్లాడరేం మోదీ?: రాహుల్
ABN , First Publish Date - 2022-09-26T08:07:56+05:30 IST
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ ధర రూ.400 ఉండేది.
త్రిస్సూర్, సెప్టెంబరు 25: ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ ధర రూ.400 ఉండేది. ఈ ధరే చాలా ఎక్కువ అని నానా యాగీ చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు అదే సిలిండర్ ధర రూ.1000 దాటించేశారు. అయినా ఈ ధరలపై మోదీ మాట్లాడటం లేదు’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న ఆయన త్రిస్సూర్ బహిరంగ సభలో ప్రసంగించారు. పెట్రో, వంట గ్యాస్ ధరలను మోదీ ప్రభుత్వం విపరీతంగా పెంచేసిందని ధ్వజమెత్తారు. ధరలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రధాని మోదీ, ఆర్ఎ్సఎస్ దేశంలో విధ్వేషాలు రగిలిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతకుముందు తిరూర్ జిల్లా వడక్కంచేరి నుంచి 11 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేశారు. ఆయన వెంట నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు గ్యాస్ ధరలపై ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఉదయం పాదయాత్ర ముగిసిన వెంటనే రాహుల్గాంధీ హెలికాఫ్టర్లో కొజీకోడ్ వెళ్లి కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్యదాన్ మహమూద్ మృతదేహానికి నివాళులర్పించారు. శనివారం మహమూద్ అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.