‘బిగ్‌బాస్’పై మరోసారి కోర్టుకెళ్తా..: నారాయణ

ABN , First Publish Date - 2021-09-14T22:40:34+05:30 IST

హైదరాబాద్: బిగ్‌బాస్ కార్యక్రమం.. ఓ బ్రోతల్ స్వర్గమని, దీన్ని ఆపాలని మరోసారి కోర్టుకు వెళ్లనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్ షోపై

‘బిగ్‌బాస్’పై మరోసారి కోర్టుకెళ్తా..: నారాయణ

హైదరాబాద్: బిగ్‌బాస్ కార్యక్రమం.. ఓ బ్రోతల్ స్వర్గమని, దీన్ని ఆపాలని మరోసారి కోర్టుకు వెళ్లనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్ షోపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా రెడ్‌లైట్ ఏరియా సంస్కృతిని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో యువతీయువకులను 105 రోజులు.. ఒకే గదిలో పెడుతున్నారన్నారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు. కార్యక్రమాన్ని 24గంటలూ లైవ్ పెట్టగలరా అని సవాల్ విసిరారు.


ఒకరితో ముద్దు పెట్టుకొని.. మరొకరితో డేటింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇది సాంస్కృతిక దోపిడీ అని దుయ్యబట్టారు. దీనికి హీరో నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారని.. తద్వారా సమాజానికి ఏం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. బిగ్‌బాస్ కార్యక్రమం నిలిపేయాలని.. తాను చాలా ఏళ్లుగా పోరాడుతున్నారని చెప్పారు. తాను వేసిన పిటిషన్లను కోర్టులు పెండింగ్‌లో పెడుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై మరోసారి కోర్టుకు వెళ్లనున్నట్లు నారాయణ పేర్కొన్నారు.


ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం వద్దు..

ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం వల్ల నీటి కాలుష్యం పెరుగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ విషయంపై హైకోర్టు చెప్పినా.. గణేష్ ఉత్సవ సమితి కోర్టుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైకోర్టు సలహాను పాటించాలని ఉత్సవ సమితికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని పాటించాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని చెప్పడం.. మంచి నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల విషయంలో అలాగే చేయాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-09-14T22:40:34+05:30 IST