శిక్షణ పూర్తయ్యాక వస్తానని...
ABN , First Publish Date - 2021-11-23T04:55:21+05:30 IST
విధుల్లో అంకితభావంతో పనిచేసే కానిస్టేబుల్గా అతనికి మంచి పేరుంది. ఊరొచ్చినా అందరితో కలివిడిగా ఉండేవాడు. రక్షణ శాఖలో ప్రవేశించాలని యువతను ప్రోత్సహించేవాడు. వారం రోజుల కిందటే భార్యాపిల్లలను స్వగ్రామం పంపించాడు. తుపాకీ పేల్చడంతో శిక్షణ పూర్తయ్యాక ఇంటికి వస్తానని చెప్పాడు.
అంతలోనే విషాదం
పొరపాటున పేలిన తుపాకీ
నాందేడ్లో కానిస్టేబుల్ మృతి
శోకసంద్రంలో సింగనాపురం గ్రామస్థులు
జియ్యమ్మవలస, నవంబరు 22 : విధుల్లో అంకితభావంతో పనిచేసే కానిస్టేబుల్గా అతనికి మంచి పేరుంది. ఊరొచ్చినా అందరితో కలివిడిగా ఉండేవాడు. రక్షణ శాఖలో ప్రవేశించాలని యువతను ప్రోత్సహించేవాడు. వారం రోజుల కిందటే భార్యాపిల్లలను స్వగ్రామం పంపించాడు. తుపాకీ పేల్చడంతో శిక్షణ పూర్తయ్యాక ఇంటికి వస్తానని చెప్పాడు. భర్త రాక కోసం ఎదురుచూస్తున్న ఆమెకు గుండెలు తరుక్కుపోయే వార్త తెలిసి హతాశురాలైంది. తన ఆశల దీపం ఆరిపోయిందని తెలిసి కుప్పకూలిపోయింది. చింతలబెలగాం పంచాయతీ సింగనాపురం గ్రామానికి చెందిన పప్పల భానుప్రసాద్ (35) విషాదాంతమిది. వివరాలివీ... భానుప్రసాద్ ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్పట్నంలో ఎస్ఎస్బీ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. రోజులాగే సోమవారం ఉదయం తుపాకీ కాల్చడంలో శిక్షణ కోసం తోటి కానిస్టేబుల్తో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. కొద్దిదూరం ప్రయాణించాక వారి వాహనం అదుపు తప్పి రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలోకి మళ్లింది. ఆ సమయంలో వెనుక కూర్చొన్న భానుప్రసాద్ తుపాకిపై ఒత్తిడి పడి అకస్మాత్తుగా పేలింది. చాతీలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారాన్ని అక్కడి సిబ్బంది భానుప్రసాద్ మావయ్య సింగనాపురం గ్రామానికి చెందిన ఎల్.స్వామినాయుడుకు తెలియజేశారు. భానుప్రసాద్కు భార్య లావణ్య, ఏడేళ్ల కుమార్తె హరణ్య, ఐదేళ్ల కుమారుడు జ్యోసిక్ ఉన్నారు. భానుప్రసాద్ లేరన్న నిజాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.