ఇంట్లోకి చొరబడి, హల్‌చల్ చేసిన అడవి పందులు

ABN , First Publish Date - 2020-11-01T00:01:09+05:30 IST

కేరళలోని కొజిక్కోడ్ జిల్లాలో అడవి పందులు స్వైర విహారం చేస్తున్నాయి

ఇంట్లోకి చొరబడి, హల్‌చల్ చేసిన అడవి పందులు

తిరువనంతపురం : కేరళలోని కొజిక్కోడ్ జిల్లాలో అడవి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. కొండలు, అడవుల సమీపంలోని గ్రామస్థులు ప్రతి రోజూ భయంతో బతుకుతున్నారు. వీటి బారినపడి కొందరు గాయాలపాలయ్యారు. దీంతో వీటిని చంపేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కూరచుండు గ్రామంలో మోహనన్ ఇంట్లోకి రెండు అడవి పందులు చొరబడ్డాయి. అదృష్టవశాత్తూ ఆయన కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరగలేదు. 


కొజిక్కోడ్ జిల్లాలోని కూరచుండు గ్రామం ఓ కొండ పక్కన ఉంది. అడవి పందులు ఈ గ్రామవాసులను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. శుక్రవారం మోహనన్ ఇంట్లోకి రెండు అడవి పందులు చొరబడ్డాయి. ఓ గదిలో దూరి, మంచంపైకి ఎక్కాయి, మళ్ళీ క్రిందకు దిగాయి. వీటిని గమనించిన మోహనన్ కుటుంబ సభ్యులు ఆ గదికి తాళం వేసి, ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం పంచాయతీ సభ్యులు, గ్రామస్థులు స్థానిక పోలీసులను, అటవీ శాఖను సంప్రదించారు. ఈ అడవి పందుల వల్ల తాము చాలా భయాందోళనలతో గడుపుతున్నామని, వీటి నుంచి తమకు శాశ్వత రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 


కూరచుండు పోలీసులు, పెరువన్నాముళి అటవీ రేంజ్ అధికారులు వచ్చి, ట్రాంక్విలైజర్లతో ఆ అడవి పందులను పట్టుకుని అడవిలో వదిలిపెట్టేందుకు తీసుకెళ్తామని చెప్పారు. అయితే గ్రామస్థులు వాటిని చంపేయాలని డిమాండ్ చేశారు. అడవి పందుల దాడిలో గతంలో ఇద్దరు మహిళలు గాయపడ్డారని చెప్పారు. గ్రామస్థులు పట్టు వీడకపోవడంతో ఆ పందులను అధికారులు కాల్చి చంపేశారు. 


Updated Date - 2020-11-01T00:01:09+05:30 IST