ఉదయం ఇంటి వాకిలి ఊడ్చింది... కొద్దిసేపటికే..
ABN , First Publish Date - 2020-03-20T16:43:58+05:30 IST
నవ వధువు ఆత్మహత్య పాల్పడింది. ప్రేమ వివాహం చేసుకన్న ఆమె ఐదు నెలలకే ఆత్మహత్యకు...
ప్రేమ వివాహం చేసుకున్న నవ వధువు ఆత్మహత్య!
వివాహమైన ఐదు నెలలకు మృత్యువాత
భువనగిరి టౌన్: నవ వధువు ఆత్మహత్య పాల్పడింది. ప్రేమ వివాహం చేసుకన్న ఆమె ఐదు నెలలకే ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సంజీవనగర్లో గురువారం జరిగింది. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. స్థానిక సంజీవనగర్కు చెందిన భూషపాక సుభాష్, శ్రావణి గతేడాది నవంబరు 22న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తుండగా శ్రావణి స్థానిక ప్రైవేట్ హైస్కూల్లో టీచర్గా పని చేస్తోంది. గురువారం ఉదయం ఇంటి వాకిలి ఊడ్చిన శ్రావణి కొద్దిసేపటికే ఇంట్లోని వంటగదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో ఇంట్లో భర్తతో పాటు కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారని ఆరోపించారు. శ్రావణి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.
కొంతకాలంగా వరకట్నం కోసం వేధిస్తున్న భర్తనే గర్భిణి అని కనికరం లేకుండానే ముందస్తు ప్రణాళికతో ఉరేసి హత్య చేశాడని ఆరోపిస్తూ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి మృతిపై వాస్తవాలను తేల్చేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఏసీపీ భుజంగ రావు, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేశం, ఎస్ఐ అంజయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి రెండు కుటుంబాల గృహాల వద్ద ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.