కొడుకుతో కలిసి భర్త హత్య

ABN , First Publish Date - 2020-09-25T08:52:29+05:30 IST

మద్యం తాగి వేధిస్తున్న తన భర్తను కొడుకుతో కలిసి హత్య చేసిందా భార్య. అనంతరం తమ వ్యవసాయ భూమిలోనే అతడి శవాన్ని పాతిపెట్టింది....

కొడుకుతో కలిసి భర్త హత్య

చేవెళ్ల, సెప్టెంబరు 24: మద్యం తాగి వేధిస్తున్న తన భర్తను కొడుకుతో కలిసి హత్య చేసిందా భార్య. అనంతరం తమ వ్యవసాయ భూమిలోనే అతడి శవాన్ని పాతిపెట్టింది. దాదాపు రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘోరం, బంధువుల అనుమానంతో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా  గుండాల గ్రామానికి చెందిన సాలే కిష్టయ్యకు(45) భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.


కూతురు పెళ్లై అత్తింట్లో ఉంటోంది. కిష్టయ్య, భార్య, కొడుకు కూలిపనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో అర్ధరాత్రి వేళ మద్యం తాగి ఇంటికొచ్చిన కిష్టయ్య, తన భార్య లలితతో గొడవపడ్డాడు. దీంతో ఆమె, కొడుకు రమేశ్‌ (20) కలిసి కిష్టయ్య మెడ నులిమి హత్య చేశారు. అదే రోజు రాత్రి మృతదేహాన్ని తమ వ్యవసాయ పొలంలో గుంత తీసి పాతిపెట్టారు. కిష్టయ్య ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడని కన్నీరు పెట్టుకుంటూ గ్రామస్థులను, బంధువులను నమ్మించారు. రెండు నెలలైనా అతడు రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు రమేశ్‌ను గట్టిగా నిలదీశారు. తండ్రిని తాను, తల్లి కలిసి చంపి తమ పొలంలోనే పాతి పెట్టామని రమేశ్‌ వారికి తెలిపాడు. దీంతో బంధువులు చేవెళ్ల పోలీసులకు సమాచారం అందించారు. 

Updated Date - 2020-09-25T08:52:29+05:30 IST